కరోనా ఆస్పత్రులు 287కు పెంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశ౦
By: chandrasekar Sat, 22 Aug 2020 01:02 AM
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న తరుణంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా ఆస్పత్రుల సంఖ్యను
138 నుంచి 287కు పెంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ
287 ఆస్పత్రుల్లో అన్ని రకాల సదుపాయాలు, సరిపడా వైద్యులు, సిబ్బంది ఉండాలని స్పష్టం చేశారు. అలాగే స్పెషలిస్టులు, డాక్టర్లను వీలైనంత త్వరగా అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కరోనా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, వైద్యులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు. ఎప్పటికప్పుడు లోపాలను, సిబ్బంది కొరతను వెంటనే పరిష్కరించాలన్నారు. హోం క్వారంటైన్లో ఉన్నవారికి సేవలు సక్రమంగా అందాలని అధికారులకు సీఎం జగన్ నిర్దేశించారు. మందులు ఇవ్వడం సహా సత్వర చికిత్స అందించాలన్నారు. అందిస్తున్న సేవలకు అనుగుణంగా కరోనా ఆస్పత్రులకు రేటింగ్ ఇవ్వాలని ఆదేశించారు. నిరంతరంగా ఆస్పత్రుల్లో ప్రమాణాలను పర్యవేక్షించాలన్నారు. కరోనా కాల్సెంటర్లు సమర్థంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు.