గృహనిర్బంధంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్...
By: chandrasekar Tue, 08 Dec 2020 6:47 PM
ఢిల్లీ సీఎం అరవింద్
కేజ్రీవాల్ను గృహనిర్బంధం చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పింది. సింఘూ బోర్డర్
వద్ద ఆందోళన చేపడుతున్న రైతుల్ని సోమవారం రోజున సీఎం కేజ్రీవాల్ పరామర్శించారు.
ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ సీఎం ని హౌజ్ అరెస్టు చేసినట్లు ఆప్ తన ట్విట్టర్లో
ఆరోపించింది.
సీఎం కానీ, బయటకు
వచ్చేందుకు ఇంట్లోకి వెళ్లేందుకు కానీ ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదని ఆమ్ ఆద్మీ తెలిపింది.
ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతుల్ని కలిసిన కేజ్రీవాల్ వారికి మద్దతు ప్రకటించారు. సేవ చేయాలన్న
ఉద్దేశంతోనే రైతుల్ని కలిసేందుకు వచ్చినట్లు ఆయన అన్నారు.
రైతుల డిమాండ్లకు మద్దతు
ఇస్తున్నామని, వారి డిమాండ్లు వాస్తవమైనవని, ముందు
నుంచి తమ పార్టీ కానీ, తాను కానీ రైతుల పట్ల సానుకూలంగా ఉన్నట్లు
తెలిపారు.
అయితే ఆందోళన చేస్తున్న
రైతుల్ని అరెస్టు చేసేందుకు స్టేడియాలను జైళ్లుగా మార్చాలని ఢిల్లీ పోలీసులు తనపై
వత్తిడి తెచ్చారని, కానీ వారికి ఎటువంటి అనుమతి ఇవ్వలేదని నిన్న
కేజ్రీ పేర్కొన్నారు. సీఎం కేజ్రీని
ఢిల్లీ పోలీసులు హౌజ్ అరెస్టు చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్
పేర్కొన్నారు.