తక్కువ సీట్ల సామర్ధ్యం మరియు అధిక కరెంట్ బిల్లుల కారణంగా సినిమా హాళ్లు తెరవలేం
By: chandrasekar Thu, 15 Oct 2020 08:20 AM
తక్కువ సీట్ల సామర్ధ్యం
మరియు అధిక కరెంట్ బిల్లుల కారణంగా సినిమా హాళ్లు తెరవలేమని ఫిలిం ఛాంబర్
సభ్యులు తెలిపారు. కరోనా అన్లాక్లో భాగంగా కేంద్రం వెసులుబాటు కల్పించినా యాభై
శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్ల నిర్వహణ కష్టతరమని, అందువల్ల
తాము సినిమా హాళ్లు తెరవబోమని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు. బుధవారం విజయవాడలోని
తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో 13 జిల్లాల ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. ఇప్పుడున్న
పరిస్థితుల్లో సినిమా హాళ్లు నడవాలంటే రూ.లక్షల్లో అదనంగా ఖర్చవుతుందని
ప్రతినిధులు వెల్లడించారు. కేంద్రం
ప్రకటించిన 24 నిబంధనల ప్రకారం థియేటర్లు నడపాలంటే ఒక్కో ప్రేక్షకుడిపై
రూ.25 అదనపు
భారం పడనుందని వివరించారు. అనంతరం ప్రెస్ మీట్ లో ఎగ్జిబిటర్స్ చీఫ్ కేఎస్ ప్రసాద్
మాట్లాడుతూ లాక్ డౌన్ పీరియడ్లో థియేటర్ల కరెంట్ బిల్లులను మాఫీ చేస్తామని
ఏపీ ప్రభుత్వం హామీనిచ్చింది. అయితే ఇప్పటివరకు మాఫీ చేయలేదు. ఈ నేపథ్యంలో
రేపటి నుంచి థియేటర్లను ఓపెన్ చేసే పరిస్థితి లేదని చెప్పారు.
కరోనా వల్ల లాక్ డౌన్
చేయడంతో థియేటర్లు చాలా నష్టానికి లోనైనట్లు తెలిపారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్
కామర్స్ (టీఎఫ్ సీసీ) సెక్రటరీ రమేశ్ మాట్లాడుతూ గత 7 నెలల్లో
ఒక్క థియేటర్ పైనే సుమారుగా రూ.4 లక్షలు కరెంట్ బిల్లు వేశారు. ఇక ప్రస్తుత పరిస్తితుల్లో
థియేటర్లను నడిపిస్తే రూ.10 లక్షలు బిల్లు అయ్యే అవకాశముంటుంది. రాష్ట్రంలో 500 థియేటర్లు
ఇప్పటివరకు కరెంట్ బిల్లులు చెల్లించలేదు. డబ్బున్నవారు, సొంతంగా
థియేటర్లున్నవారు డబ్బులు చెల్లించారు. కానీ ఇంకా చెల్లించని వారు చాలా మంది
ఉన్నారు. కరెంట్ బిల్లులు మాఫీ చేయాలని మేం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి
చేస్తున్నాం. మాఫీ చేస్త మాకు కొంత ఉపశమనం దొరుకుతుంది. తద్వారా వీలైనంత త్వరగా
థియేటర్లు ఓపెన్ చేసేందుకు అవకాశముంటుంది. సీట్ల కెపాసిటీ విషయంలో కూడా ప్రభుత్వం
నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే దీనిపై మరు
పరిశీలన చేయనున్నట్లు తెలిపారు.