Advertisement

  • శోభా నాయుడుతో తనకున్న అనుబంధాన్నితెలిపిన చిరంజీవి

శోభా నాయుడుతో తనకున్న అనుబంధాన్నితెలిపిన చిరంజీవి

By: chandrasekar Thu, 15 Oct 2020 3:50 PM

శోభా నాయుడుతో తనకున్న అనుబంధాన్నితెలిపిన చిరంజీవి


మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ కూచిపూడి కళాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభా నాయుడు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. శోభా నాయుడుతో తనకున్న అనుబంధాన్ని తెలియజేశారు.

‘‘శోభా నాయుడు మరణవార్త వినగానే నేను నిర్ఘాంతపోయాను. శోభా నాయుడు గొప్ప కూచిపూడి కళాకారిణి. నృత్య కళకే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప కళాకారిణి. ఆ స్థాయి కళాకారులు మళ్ళీ వస్తారా అనేది పెద్ద సందేహమే. శ్రీ వెంపటి చిన్న సత్యం తర్వాత ఆయన శిష్యురాలిగా ఆయనంత ఖ్యాతినీ, కీర్తినీ కూచిపూడి నృత్య కళకు తీసుకొచ్చిన గొప్ప కళాకారిణి ఆమె. వారితో నాకు వ్యక్తి గతంగా ఎంతో పరిచయం ఉంది. ఒకరిని ఒకరు అభిమానించుకొని ప్రశంశించుకునే కళాకారులం. ఈ మధ్య కాలంలో కరోనా వచ్చిన సమయంలో ఆమె చేసిన ఓ నృత్య గేయాన్ని చూశాను. అది చూసినప్పుడు నాకు ఎంత ముచ్చట కలిగిందంటే శారీరకంగా ఇబ్బంది ఉన్నా సరే దాన్ని అధిగమించి సమాజం కోసం కరోనా గురించి స్పందించి ప్రజల్ని చైతన్యం చేయడం కోసం ఆడారు పాడారు అంటే గనుక కళాకారిణిగా ఆమెకు కళల పట్ల ఉన్న అభిమానం, సమాజం పట్ల ఉన్న అభిమానం ఎంతో అర్థమౌతోంది. ఆమెకి వెంటనే నా ప్రశంశలు కోటి గారి ద్వారా పంపాను. ఆమె కూడా నాకు కృతజ్ఞతగా శుభాకాంక్షలు పంపించారు. ఇక అదే మా ఇద్దరి మధ్య జరిగిన ఆఖరి సంభాషణ. ఆమె నన్ను కలవాలని కూడా అనుకున్నారు. నన్ను తనతో ఓ వేదిక మీద చూడాలని కూడా ఆమె అనుకున్నారు. ఆమె నన్ను కలవాలనుకుంటున్నట్టు సంగీత దర్శకుడు కోటి నాకు ఫోన్‌లో చెప్పారు. నేను కోటిని ఆమె నంబర్ అడిగి తీసుకున్నా. నేనే ఆమెకు ఫోన్ చేస్తానని కూడా చెప్పా. ఆ తర్వాత ఆమె నాకు ఓ వాయిస్ మెసేజ్ పంపారు.

‘మెగాస్టార్ చిరంజీవిగారికి.. మీ అభిమానుల మనుసుల్లో శాశ్వతంగా హీరోగా నిలిచిపోయిన మా చిరుగారికి అనేక వందనాలు. కోటి గారితో మీరు నా గురించి ప్రస్తావించిన అంశాలు విని చిన్న పిల్లలా ఎగిరి గంతేశాను. మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. గాలిలో తేలిపోయింది. మీ మీద నాకున్న అభిమానం మాటల్లో చెప్పలేను. ఒకవిధంగా చెప్పాలంటే అది మాటలకందని ఆరాధన. నవరసాలను మీ కళ్లలో పలికించి చిటికెలో పండించి మా మనసుల్ని గెలిచిన మహారాజు మీరు. ఈ గడ్డుకాలం అయిపోయాక మేం చేయబోయే మొదటి ప్రదర్శనకు మీరు, కోటి గారు అతిథులుగా రావాలి’ అని భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. తప్పకుండా వస్తానని కూడా వారికి చెప్పాను. అలాంటి శోభా నాయుడు ఈరోజు మనముందు లేకపోవడం దురదృష్టకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. అలాగే, శోభా నాయుడు మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ చిరంజీవి ట్వీట్ కూడా చేశారు.

Tags :

Advertisement