అమెరికా అధ్యక్ష ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసిన డ్రాగన్ దేశం
By: Sankar Fri, 06 Nov 2020 06:37 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది...అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ సజావుగా, విజయవంతంగా పూర్తి కావాలని ఆకాంక్షించింది. కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, ఈ పరిణామాలను తాము నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. అమెరికాతో విభేదాలు ఉన్నప్పటికీ, ఇరు దేశాల మధ్య సమిష్టి ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తాయని వెల్లడించింది ..
ఈ మేరకు చైనా వైస్ ఫారిన్ మినిస్టర్ లీ యూచెంగ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఎన్నికల ఫలితంపై ఇంకా స్పష్టత రాలేదు. చైనా- అమెరికా మధ్య ఉన్న సంబంధాలపై మేం పూర్తి స్పష్టతతో ఉన్నాం. విభేదాలు ఉన్నప్పటికీ కలిసి పనిచేస్తూ, పరస్పర సహకారంతో ముందుకు సాగే అవకాశం ఉంది.
ఇరు దేశాల ప్రజలు, అంతర్జాతీయ సమాజం ఆశించిన స్థాయిలో ద్వైపాక్షిక బంధాల్లో సుస్థిరత నెలకొంటుందని భావిస్తున్నాం’’అని పేర్కొన్నారు. కాగా చైనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే ట్రంప్, అమెరికా ఎన్నికల్లో డ్రాగన్ దేశం జోక్యం చేసుకుంటోందని, బైడెన్ అధికారంలోకి వస్తే అగ్రరాజ్యంపై చైనా కమ్యూనిస్టు పార్టీ పెత్తనం చెలాయించే అవకాశం ఉందంటూ ఎన్నికల ప్రచారంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.