నేపాల్ ప్రధాని కెపి ఓలి పదవి కాపాడేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలు ..
By: Sankar Wed, 08 July 2020 10:06 AM
భారత్ కు మిత్ర పక్షంగా ఉండే నేపాల్ గత కొంత కాలంగా భారత్ మీద తీవ్ర విమర్శలు చేస్తుంది ...ముఖ్యంగా నేపాల్ ప్రధాని కెపి ఓలి భారత్ మీద విమర్శలు చేస్తున్నాడు..అయితే ఇప్పుడు ఆ విమర్శలే అతడి పదవికి ముప్పు తెచ్చాయి ..భారత్ మీద విమర్శల నేపథ్యంలో ప్రధాని రాజీనామా చేయాలని సొంత పార్టీ నాయకులే డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓలి తన ప్రధాన ప్రత్యర్థి, మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండతో వరుసగా సమావేశం అయినా లాభం లేకుండా పోయింది. అసంతృప్తి నేతలెవ్వరూ దారికి రావడం లేదు. మరోవైపు ఓలి ప్రభుత్వాన్ని కాపాడటానికి చైనా కూడా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో చైనా రాయబారి హౌ యాంకి తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గత ఏప్రిల్ నుంచి ఎన్సీపీలో అంతర్గతంగా రగులుతున్న వివాదాన్ని చల్లర్చడం కోసం చైనా రాయబారి హౌ యాంకి పలువురు నేపాలీ రాజకీయ నాయకులతో సమావేశమై చర్చలు జరిపారు. గత వారం రోజుల వ్యవధిలో కూడా చైనా రాయబారి హౌ యాంకి పలువురు నేపాల్ నేతలతో చర్చలు జరిపారు. జూలై 3న నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారిని కలిశారు. అయితే అది మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని చెప్పారు.
హౌ యాంకి, ప్రచండల మధ్య సమావేశం గురించి ఇంకా స్పష్టత రాలేదు. పీఎం ఓలికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ప్రచారానికి నాయకత్వం వహిస్తున్న ప్రచండ, హౌ యాంకి కలవడానికి ఇష్టపడరని సమాచారం. ఇదిలా ఉండగా చైనా రాయబార కార్యాలయం హౌ యాంకి సమావేశాలను సమర్థించింది. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొవడం చైనాకు ఇష్టం లేదని తెలిపింది. నేపాల్ నాయకులు తమ విభేదాలను పరిష్కరించుకుని ఐక్యంగా ఉండాలని చైనా కోరుకుంటున్నట్లు ఆ దేశ ఎంబసీ ప్రతినిధి ఒకరు మీడియాతో చెప్పారు.