చైనాకు చెందిన ఈ-కామర్స్ కంపెనీ అలీబాబా చైనాకు ఇంఫార్మెర్
By: chandrasekar Wed, 16 Sept 2020 6:46 PM
చైనాకు చెందిన ఈ-కామర్స్
కంపెనీ అలీబాబా, భారత వినియోగదారుల సమాచారాన్ని అక్రమంగా చైనాకు
పంపిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 72 చైనా సర్వర్ల ద్వారా
భారత వినియోగదారుల డేటా చైనాకు వెళ్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. యూరోపియన్ సర్వర్లతో పోలిస్తే, అలీబాబా
క్లౌడ్ డేటా సర్వర్లు తక్కువ ధరల్లో సేవలందిస్తుంటాయని వ్యాపార వర్గాలు తెలిపాయి.
అందుకే అలీబాబా క్లౌడ్ డేటా సర్వర్లు వ్యాపారాలలో బాగా ప్రాచుర్యం పొందాయి.
ఇప్పుడు అవే సర్వర్ల ద్వారా ఆ సంస్థ భారతదేశం నుంచి డేటాను చైనాకు పంపుతున్నట్లు
ఆరోపణలు వస్తున్నాయి. ఇది చైనా అధికారుల ప్రణాళిక అని నిఘా వర్గాలు
విశ్లేషిస్తున్నాయి. సంస్థలను ఉచ్చులో పడేయడానికి చైనా సర్వర్లు ముందు ఉచితంగా
సేవలు అందిస్తామని చెబుతాయి. ఆ తరువాత డేటా సర్వర్లలో నిక్షిప్తమయ్యే సున్నితమైన
సమాచారాన్ని చైనాలో ఉన్న రిమోట్ సర్వర్లకు చేరవేస్తాయి.
ఇంటెలిజెన్స్ అధికారుల
ప్రకారం, చైనా
గూఢచర్యంపై త్వరలోనే భారత ప్రభుత్వం విచారణకు ఆదేశించనున్నట్టు తెలుస్తోంది.
సెప్టెంబర్ 15న ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించిన కథనం కొన్ని
ఆసక్తికరమైన అంశాలను ప్రచురించింది. భారతదేశానికి వ్యతిరేకంగా హైబ్రిడ్ యుద్ధంలో
భాగంగా చైనా అమలు చేస్తున్న సైబర్ వ్యూహాలను ఆ పత్రిక వెలుగులోకి తెచ్చింది. అంతకు
ముందే 200 కి
పైగా చైనా యాప్లపై భారతదేశం నిషేధించడం సమర్థనీయమైన చర్య అని ఇంటెలిజెన్స్
ఏజెన్సీల వర్గాలు భావిస్తున్నాయి. చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న ప్రైవేట్ నిఘా
సంస్థలు భారతదేశాన్ని నిత్యం కనిపెడుతూనే ఉంటాయి. మన దేశ చర్యలను పరిశీలించడంలో, విశ్లేషించడంలో
నిమగ్నమై ఉంటాయి. ఇరు దేశాల మధ్య పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో
సైబర్ యుద్ధ వ్యూహాల ద్వారా పైచేయి సాధించేందుకు చైనా ప్రయత్నిస్తోంది.