భారత్ను తాము శత్రువుగా కంటే భాగస్వామిగా పరిగణిస్తున్నామన్న చైనా
By: chandrasekar Wed, 26 Aug 2020 5:41 PM
చైనా కపట నాటకం ఆడుతుందనటానికి వారి మాటల్లోనే వివరాలు. ఓ వైపు సరిహద్దుల్లో సైనిక సంపత్తిని వాస్తవాధీన రేఖ వెంబడి మోహరిస్తూ మరోవైపు బలగాల ఉపసంహరణ కోసం చర్చలు జరుపుతున్న చైనా భారత్తో దోస్తీ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ను తాము శత్రువుగా కంటే భాగస్వామిగా పరిగణిస్తున్నామని ప్రకటించింది. పొరుగు దేశాన్ని ముప్పుగా కంటే అవకాశంగా తాము భావిస్తున్నామని పేర్కొంది. చైనా-ఇండియా యూత్ వెబినార్లో ప్రసంగించిన సందర్భంగా చైనా రాయబారి సన్ వీయ్డంగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
భారత భూభాగాన్ని ఆక్రమించిన చైనా కపట మాటలతో ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యలు, విబేధాలను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని ద్వైపాక్షిక సంబంధాలను మళ్లీ గత స్థాయికి తీసుకెళ్లాలని సన్ వ్యాఖ్యానించారు. ఆగష్టు 18న చైనా రాయబారి వెబినార్లో మాట్లాడగా చైనీస్ ఎంబసీ ఆయన స్పీచ్ను మంగళవారం విడుదల చేసింది. జూన్ 15 న భారత్, చైనా బలగాల మధ్య చోటు చేసుకున్న గల్వాన్ ఘర్షణ దురదృష్టకరమని సన్ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు జరగాలని భారత్, చైనా కోరుకోవడం లేదన్నారు.
గతంలో జరిగిన ఘర్షణలు కారణంగా భారత్ సరిహద్దుల్లో చైనా బలగాలను భారీ స్థాయిలో మోహరించడంతో గత నాలుగు నెలలు తూర్పు లడఖ్ ప్రాంతంలో ఇరు దేశాల సైన్యం మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. గల్వాన్ లోయలో తలెత్తిన ఘర్షణల్లో 20
మంది భారత సైనికులు అమరులవడంతో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. అప్పటి నుంచి ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నప్పటికీ అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. సరిహద్దులో సైన్యంతో బాటు ఆయుధాలను కూడా చైనా మోహరిస్తూవుంది. భారత్ వాళ్లకు దీటుగా మరిన్ని అధునాతన ఆయుధాలను మోహరిస్తూవుంది.