Advertisement

భారత సరిహద్దులో చైనా మరో కీలక ప్రాజెక్టు...

By: chandrasekar Mon, 02 Nov 2020 7:10 PM

భారత సరిహద్దులో చైనా మరో కీలక ప్రాజెక్టు...


భారత సరిహద్దు సిచువాన్ - టిబెట్ లో చైనా రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి సర్వం సిద్ధం చేసింది. సిచువాన్ ప్రావిన్స్ నైరుతి ప్రాంతంలోని యాన్ ను టిబెట్‌లోని లింజి ప్రాంతంతో కలిపే ఈ రైల్వే లైను భారత సరిహద్దుకు అత్యంత సమీపం నుంచి వెళ్లనుంది. భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌కు అత్యంత సమీపంలో చైనా దీన్ని వ్యూహాత్మకంగా నిర్మిస్తోంది. భౌగోళికంగా సంక్లిష్టమైన ప్రాంతంలో చేపట్టిన ఈ ప్రాజెక్టులో రెండు సొరంగ మార్గాలు, ఓ భారీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. చైనా ప్రభుత్వం ఇందుకు సంబంధించి శనివారం బిడ్డింగ్ ప్రక్రియ పూర్తి చేసింది. ఈ రైల్వే ప్రాజెక్టుతో పాటే.. దీనికి అవసమైన విద్యుచ్చక్తి కోసం పవర్ ప్రాజెక్టును చేపట్టనున్నారు.

సిచువాన్-టిబెట్ రైల్వే చైనాలోని చెంగ్డూ నుంచి ప్రారంభం అవుతుంది. ఇది సిచువాన్ ప్రావిన్స్ రాజధాని నగరం. ఈ రైల్వే లైను పూర్తయితే చెంగ్డూ నుంచి లాసా పట్టణానికి ప్రస్తుతం 48 గంటలుగా ఉన్న ప్రయాణ సమయం 13 గంటలకు తగ్గుతుంది. సిచువాన్-టిబెట్ ప్రాంతంలో ఇది చైనా చేపట్టిన రెండో ప్రాజెక్టు. క్వింజై-టిబెట్ మధ్య ఇప్పటికే ఓ రైల్వే ప్రాజెక్టును నిర్మించింది. ప్రపంచంలో భౌగోళికంగా అత్యంత క్రియాశీల ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన రైల్వే లైనుగా దీనికి గుర్తింపు ఉంది. తాజాగా నిర్మించి తలపెట్టిన యాన్-లింజి రైల్వే లైను పొడవు 1,011 కి.మీ. ఈ మార్గంలో రైళ్లు గంటకు 120 కి.మీ. నుంచి 200 కి.మీ. వేగంతో పరుగులు తీసేలా నిర్మాణం చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం చైనా 319.8 బిలియన్ యాన్స్ ఖర్చు చేయనుంది. ఈ ప్రాజెక్టు టిబెట్ ప్రాంతానికి కీలకం కావడంతో పాటు చైనా సైన్యానికి వ్యూహాత్మకంగానూ దోహదపడనుంది.

Tags :
|
|

Advertisement