Advertisement

యాప్‌ల నిషేధంపై చైనా తీవ్ర ఆందోళన

By: chandrasekar Wed, 01 July 2020 4:05 PM

యాప్‌ల నిషేధంపై చైనా తీవ్ర ఆందోళన


తూర్పు లఢక్‌ గల్వాన్‌ లోయలో భారత సైనికులపై దాడికి దిగి 20 మందిని హతమార్చిన నేపథ్యంలో చైనాను ఏకాకిగా చేసేందుకు భారత్‌ కంకణం కట్టుకొన్నది. చైనాను సైనికపరంగా కాకుండా ఆర్థికంగా దెబ్బతీసేందుకు భారత్‌ పావులు కదుపుతున్నది.

చైనాకు చెందిన, ఆ దేశంతో సంబంధమున్న 59 యాప్‌లను భారత్‌ నిషేధించడంపై ఆ దేశం ఆందోళన వ్యక్తం చేసింది. ‘చైనా తీవ్రంగా ఆందోళన చెందుతున్నది. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాం’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ పేర్కొన్నట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.

అంతర్జాతీయ, స్థానిక చట్టాల నిబంధనలకు కట్టుబడి ఉండాలని చైనా వ్యాపారులకు తమ ప్రభుత్వం చెబుతుంది. చైనాతో సహా అంతర్జాతీయ పెట్టుబడిదారుల చట్టపరమైన హక్కులను సమర్థించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉన్నది’ అని లిజియాన్ చెప్పినట్లు పేర్కొంది.

దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రత నేపథ్యంలో చైనాకు సంబంధించిన 59 యాప్‌లపై భారత్‌ సోమవారం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. టిక్‌టాక్‌తోసహా హలో, లైకీ, యూసీ బ్రౌజర్‌, కామ్‌స్కానర్‌, విగొ వీడియో, వంటి పలు యాప్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. తూర్పు లఢక్‌ సరిహద్దులో ఈ నెల 15న భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైన నేపథ్యంలో భారత్‌ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకున్నది. మరోవైపు భారత్‌ నిషేధించిన 59 చైనా యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగించినట్లు గూగుల్‌ సంస్థ పేర్కొంది.

Tags :
|
|
|

Advertisement