ఘర్షణల్లో ఓ కమాండింగ్ అధికారి మరణించినట్లు చైనా ఆర్మీ ప్రకటన
By: chandrasekar Tue, 23 June 2020 10:51 AM
గల్వాన్ ఘర్షణల్లో తమ
వైపు మరణాలపై నోరు మెదపని డ్రాగన్ ఎట్టకేలకు పెదవి విప్పింది. జూన్ 15న చోటు
చేసుకున్న ఈ ఘర్షణల్లో ఓ కమాండింగ్ అధికారి మరణించినట్లు చైనా ఆర్మీ తెలిపింది.
జూన్ 22
ఇండియన్ ఆర్మీతో చర్చల సందర్భంగా ఈ విషయం చెప్పినట్లు తెలుస్తోంది. నాటి ఘర్షణల్లో
చైనాకు చెందిన 45 మంది జవాన్లు మృతి చెందినట్లు భావిస్తున్నా
అధికారికంగా తెలుస్తున్న తొలి మరణం ఇదే కావడం గమనార్హం. గల్వాన్ లోయలో సుమారు 15,000 మీటర్ల ఎత్తులో జరిగిన ఘర్షణలో భారత్కు చెందిన 20 మంది
జవాన్లు వీరమరణం చెందిన విషయం తెలిసిందే. వీరిలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన
కల్నల్ సంతోష్ బాబు ఉన్నారు. ఈ ఘటనలో గాయపడిన 76 మంది జవాన్లు లేహ్ సహా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స
పొందుతున్నారు. వారం రోజుల్లో వీరు విధుల్లో చేరుతారని ఇండియన్ ఆర్మీ ఇప్పటికే
ప్రకటించింది.
గల్వాన్ లోయలో వాస్తవాధీన
రేఖ వెంబడి చైనా బలగాలు కొంత కాలంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. భారత
భూభాగంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. చైనా బలగాలు ఏర్పాటు చేసిన
శిబిరాలను తొలగించాల్సిందిగా భారత అధికారులు సూచించగా తొలగించినట్లే తొలగించి దొంగ
దెబ్బ తీశారు. ఉన్నట్టుండీ జూన్ 14న అకస్మాత్తుగా మళ్లీ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ
క్రమంలో కల్నల్ సంతోశ్ బాబు నేతృత్వంలోని భారత బృందం ఆ శిబిరాలను తొలగించడానికి
వెళ్లింది. ఈ క్రమంలో ఇరు దేశాల సైనికులు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. ఈ
ఘర్షణలో పలువురు సైనికులు గాయపడ్డారు. చైనా బలగాలతో పోరాడుతూ కల్నల్ సురేశ్ బాబు
తీవ్రంగా గాయపడినప్పటికీ అక్కడే ఉండి గాయపడిన సైనికులను వెనక్కి పంపించి అదనపు
బలగాలను అక్కడకు రప్పించారు. 45 నిమిషాల తర్వాత 300 మందికి పైగా చైనా జవాన్లు పదునైన ఆయుధాలతో భారత
జవాన్లపైకి మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. భారత జవాన్లు 100 మంది
లోపే ఉన్నా వెన్నుచూపలేదు.
భారత సైన్యం ప్రదర్శించిన
ధైర్య సాహసాలకు చైనా సైన్యం ఖంగు తిన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాల్లో
పేర్కొన్నారు. తమకు స్ఫూర్తిగా ఉండి పోరాడుతున్న కల్నల్ సంతోశ్ బాబుపై చైనా బలగాలు
రాయితో దాడి చేశాయి. తలకు బలమైన గాయం కావడంతో ఆయన గల్వాన్ నదిలో పడిపోయారు. చైనా
బలగాలు తమ కల్నల్పై దొంగ దాడి చేయడంతో భారత జవాన్లు రెచ్చిపోయారు. ప్రత్యర్థి
చేతిలో మారణాయుధాలున్నా లెక్కచేయకుండా ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో ఇరు దేశాలకు
చెందిన పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘర్షణలో 20 మంది
భారత జవాన్లు అమరులైనట్లు భారత్ ప్రకటించగా చైనా వైపు ఏం జరిగింది మాత్రం డ్రాగన్
వెల్లడించలేదు. చైనా వైపు వచ్చిన అంబులెన్స్లు, హెలికాప్టర్లు, చైనీయుల
సంభాషణ ఆధారంగా 40 మంది కంటే ఎక్కుక మంది జవాన్లు మరణించినట్లు అమెరికా
ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. భారత్ జవాన్ల చేతిలో ఎదురైన పరాభవాన్ని
బీజింగ్ అవమానంగా భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాల్లో పేర్కొన్నారు.
గల్వాన్ ఘటనలో అమరులైన భారత జవాన్లకు ప్రభుత్వ లాంఛనాలతో ఊరేగింపులు, అంత్యక్రియలు
జరిగిన వీడియోలు, ఫోటోలను చైనాలో సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు
తెలుస్తోంది. అదే సమయంలో చైనా అధికారులు మాత్రం మరణించిన తమ సైనికుల సమాచారం
గురించి చెప్పకపోవడంతో చైనీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.