చైనా అలర్ట్:తమ దేశ ప్రజల్ని వెనక్కి పిలిపించుకుంటోంది
By: chandrasekar Wed, 27 May 2020 3:29 PM
కరోనా వచ్చిన మొదట్లో
ప్రపంచం మొత్తం చైనాలోని తమ దేశ ప్రజల్ని వెనక్కి పిలిపించుకున్నాయి. ఇప్పుడు అదే
చైనా కరోనా నుంచి చాలావరకూ తప్పించుకొని ఎక్కడ కరోనా ఎక్కువగా ఉంటే అక్కడి నుంచి
తమ దేశ ప్రజల్ని వెనక్కి పిలిపించుకుంటోంది. తాజాగా ఇండియాలో రోజూ 6వేలకు పైగా కేసులు నమోదవుతుంటే చైనా అలర్ట్ అయ్యింది.
ఎందుకైనా మంచిదని ఇండియాలోని తమ దేశ ప్రజల్ని వెనక్కి రప్పించేందుకు భారీ
కార్యక్రమం ప్రారంభించింది.
ఇండియాలో చైనాకి
సంబంధించిన విద్యార్థులున్నారు. పర్యాటకులున్నారు. వ్యాపారవేత్తలున్నారు. వారంతా
ఇండియాలో కరోనా లాక్ డౌన్ వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనిపై చైనా
ఆందోళన చెందలేదు. కానీ ఇప్పుడు ఇండియా ఎక్కువ కేసులున్న దేశాల్లో టాప్ 10కి చేరడంతో జాగ్రత్త పడుతోంది. స్వదేశానికి ఎవరైనా
రావాలనుకుంటే విమాన టికెట్లు బుక్ చేసుకోండి అని సోమవారం తన అధికారిక వెబ్సైట్లో
నోటీస్ ఉంచింది.
ప్రస్తుతం ఇండియాలో 1.40 లక్షల మందికి కరోనా ఉంది. డిసెంబర్లో చైనాలోని
వుహాన్లో తొలి కేసు నమోదవగా ఇప్పుడు 200కు
పైగా దేశాల్లో ఆ వైరస్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా 55 లక్షల మందికి వైరస్ సోకింది. చైనాలో మాత్రం
ప్రస్తుతం 81
మందికి మాత్రమే వైరస్ ఉంది. అలా కొవిడ్ను కంట్రోల్ చేసిన చైనా ఇతర దేశాల ద్వారా
అది తమకు సోకకుండా జాగ్రత్త పడుతోంది.
చైనాలోని 700 మంది భారతీయుల్ని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో
వెనక్కి తీసుకొచ్చింది. ఇప్పుడు చైనా వెనక్కి పిలిపించుకుంటూ ఓ కండీషన్ పెట్టింది.
గత 14 రోజుల్లో కరోనా లక్షణాలు, జ్వరం లాంటివి వున్నవాళ్లు మాత్రం ప్రత్యేక
విమానాల్లో టికెట్లు బుక్ చేసుకోవద్దని తెలిపింది. టికెట్ ఖర్చులు, చైనాలో క్వారంటైన్ ఖర్చులను ప్రయాణికులే
పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు
ఉన్నాయి. ఇలాంటి సమయంలో చైనా తీసుకున్న నిర్ణయంపై చర్చ జరుగుతోంది.