భారత్ బోర్డర్ ప్రోటోకాల్స్ను ఉల్లంఘిస్తున్నట్టు చైనా ఆరోపణ
By: chandrasekar Thu, 18 June 2020 09:42 AM
భారత్ సైన్యంతో జరిగిన
ఘర్షణపై చైనా స్పందించింది. గాల్వన్ లోయపై చైనా సార్వభౌమతాన్ని కలిగి ఉందని
ప్రకటించినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. సరిహద్దు అంశాలకు సంబంధించి భారత్
బోర్డర్ ప్రోటోకాల్స్ను ఉల్లంఘిస్తున్నట్టు చైనా ఆరోపించింది.
కమాండర్ స్థాయిలో జరిగిన
చర్చలను భారత్ ఉల్లంఘించినట్టు చైనా ఆరోపణ
చేస్తోంది. ‘గాల్వన్ లోయపై సార్వభౌమత్వం ఎప్పుడూ చైనాదే. భారత సరిహద్దు
బలగాలు బోర్డర్ నిబంధనలు ఉల్లంఘించాయి. భారత ఫ్రంట్ లైన్ ట్రూప్స్ డిసిప్లిన్గా
ఉండాలని, రెచ్చగొట్టడం
లాంటివి మానుకోవాలని కోరాం. చైనాతో కలసి సరైన మార్గంలో చర్చల ద్వారా
అభిప్రాయబేధాలను పరిష్కరించుకోవాలి’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో
లిజియన్ అన్నారు.
అంతకు ముందు భారత
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ జూన్ 15వ తేదీ
రాత్రి గాల్వన్లో ఘర్షణ చైనీస్ సైన్యం వల్లే మొదలైందని చెప్పారు. స్టేటస్ కో
మెయింటెయిన్ చేయాలని, బలగాలను వెనక్కు రప్పించేందుకు చేసుకున్న ఒప్పందాన్ని
చైనా అమలు చేసి ఉంటే ఈ ఘర్షణ వచ్చి ఉండేది కాదన్నారు. గాల్వన్ లోయలో జరిగిన
ఘర్షణలో చైనీస్ బలగాలు కూడా గాయపడినట్టు చెప్పారు.
జూన్ 15వ తేదీ
రాత్రి జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో
సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కూడా అమరుడయ్యాడు. చైనా వైపు సుమారు 43 మంది
కూడా గాయపడినట్టు భారత ఆర్మీ తెలిపింది. కానీ, ఆ దేశం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.