మరో విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
By: chandrasekar Wed, 23 Sept 2020 12:29 PM
రాష్ట్రంలో సంక్షేమ
పథకాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో విప్లవాత్మక
పథకానికి శ్రీకారం చుట్టారు. సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించేందుకు
ఉద్దేశించిన ‘వైఎస్సార్ జలకళ’ కార్యక్రమాన్ని ఈ నెల 28వ
తేదీన ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో అర్హులైన రైతులందరూ గ్రామ సచివాలయాల్లో గాని, ఆన్లైన్లో
దరఖాస్తు చేసుకోవాలని సమాచార కమిషనర్ విజయ్కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు
సోమవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ప్రతిపక్ష
నేతగా పాదయాత్ర చేసిన సమయంలో పేద రైతులకు ఉచితంగా బోర్లు తవ్విస్తామని హామీ
ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ ‘వైఎస్సార్ జలకళ’ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.
దీనిలో భాగంగా
హైడ్రలాజికల్, జియోఫిజికల్ సర్వేల ఆధారంగా ఆయా ప్రదేశాల్లో బోర్ల
తవ్వకం చేపడతారని కమిషనర్ విజయ్కుమార్ రెడ్డి వెల్లడించారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే
అర్హులైన రైతులను ఎంపిక చేస్తామని, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని, వివరాలను
ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా వారికి తెలియజేస్తామన్నారు. అలాగే బోర్లు తవ్వే
పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తామని, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసిన తర్వాతే
చెల్లింపులు జరుపుతామని విజయ్కుమార్రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 28న సీఎం
జగన్ సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, ఆ రోజు నుంచే దరఖాస్తుల
స్వీకరణ మొదలవుతుందని విజయ్ కుమార్
రెడ్డి పేర్కొన్నారు.