సినిమా రంగానికి వరాల కురిపించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి..
By: chandrasekar Tue, 24 Nov 2020 10:30 AM
కరోనా వల్ల మొత్తం సినీ
ఫీల్డ్ నష్టాల బారిన పడింది. కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన సినిమా రంగానికి వరాల
జల్లు కురిపించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రముఖ నటుడు చిరంజీవి కృతజ్ఞతలు
తెలియజేశారు. తెలుగు సినీ పరిశ్రమను
కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. కోవిడ్
కారణంగా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూసి వేయడం వల్ల పరిశ్రమకు, కార్మికులకు
జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి ప్రభుత్వ పరంగా రాయితీలు, మినహాయింపులు
ఇవ్వనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ట్విటర్ వేదికగా
కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
నష్టాల బారినుండి
బయటపడటానికి చిన్న సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్మెంట్, రాష్ట్ర
వ్యాప్తంగా సినిమా థియేటర్లకు విద్యుత్ కనీస డిమాండ్ ఛార్జీల రద్దు, రాష్ట్రంలోని
అన్ని సినిమా థియేటర్లలో షోలను పెంచుకునేందుకు అనుమతినివ్వడం మంచి నిర్ణయం.
మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలలో ఉన్న విధంగా టికెట్ల ధరలను సవరించుకునే
వెసులుబాటు లాంటి చర్యలు కష్ట సమయంలో సినీ పరిశ్రమకు, దానిపై
ఆధారపడిన లక్షలాది కుటుంబాలకు ఎంతో తోడ్పాటుగా ఉంటాయి. కేసీఆర్ నేతృత్వంలో ఆయన విజన్కు తగ్గట్టుగా
తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి సాధించి దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందన్న
పూర్తి విశ్వాసం మాకుందని చిరంజీవి ట్వీట్ చేశారు. ఇది సినిమా రంగం కోలుకోవడానికి
ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.