ఏపీలో వర్షాల వల్ల ఏర్పడ్డ నష్టాలపై ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే
By: chandrasekar Tue, 20 Oct 2020 09:26 AM
ఆంధ్ర ప్రదేశ్ లో భారీ
వర్షాలు, వరదల
ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పంట నష్టంపై వెంటనే అంచనాలు పూర్తి
చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వీలైనంత
త్వరగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, రబీలో పంట పెట్టుబడికి ఇది ఉపయోగపడుతుందని
పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరద బీభత్సం నేపథ్యంలో కృష్ణా, గుంటూరు
జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. కృష్ణా జిల్లా నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం, గుంటూరు
జిల్లా తాడికొండ తదితర నియోజకవర్గాల పరిధిలోని ముంపు ప్రాంతాలను, దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలను సీఎం జగన్
పరిశీలించారు.
ఎప్పుడు లేని విధంగా
కురిసిన భారీ వర్షాలు వల్ల సాధారణ ప్రజలు మరియు రైతులు చాలా నష్టాలకు గురైనారు.
వీరికి సహాయక చర్యల్లో భాగంగా వరదల వల్ల లంక భూములు, నదీ పరీవాహక ప్రాంతాల్లో
దెబ్బతిన్న పంటలను సీఎం జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మిగిలిన జిల్లాల్లో కూడా
వరదల్లో మునిగిన పంటలతో పాటు, ఇళ్లు, పశువులు నష్టపోయిన వారిని గుర్తించి వెంటనే పరిహారం
ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. కాగా, కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో వరదల్లో చిక్కుకుని
ఇబ్బందులు పడుతున్న ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్
పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.