తొలిసారిగా చేప ప్రసాద పంపిణి నిలిపివేత
By: Sankar Mon, 08 June 2020 7:44 PM
మృగశిర కార్తె రోజున హైదరాబాద్లో చేప ప్రసాదం ప్రతి సంవత్సరము ఎందరో ఆస్తమా రోగులకు అందిస్తున్నారు..కానీ ఈ సారి కరోనా రావడంతో చేప ప్రసాదం పంపిణి నిలిపివేశారు ..ఆస్తమా రోగులు ఆపన్నహస్తంగా భావించే చేప ప్రసాదానికి తొలిసారిగా బ్రేక్ పడింది.
ఏళ్లపాటు నిర్విరామంగా కొనసాగిన ఈ కార్యక్రమాన్ని కరోనా కారణంగా రద్దు చేశారు. సోమ, మంగళవారాల్లో ఉదయం 8.30 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 8 గంటల వరకు చేపట్టనున్న చేప ప్రసాదం పంపిణీని నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు బత్తిని హరినాథ్ గౌడ్ స్పష్టం చేశారు. కొద్దిరోజుల క్రితమే ఈ విషయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆయన వివరించారు. వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో వేలాదిగా తరలివచ్చే ప్రజలు భౌతిక దూరం పాటించే పరిస్థితి ఉండదని, అంతేకాకుండా రాత్రిపూట కర్ఫ్యూ తదితర కారణాల తో చేప ప్రసాదం అందించడం దుస్సాహసమనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హరినాథ్ గౌడ్ పేర్కొన్నారు.
ప్రతి ఏడాది చేప ప్రసాదం తయారీలో భాగంగా పంపిణీకి ఒకరోజు ముందు దూద్బౌలిలోని బత్తిని కుటుంబ సభ్యుల స్వగృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం, బావి పూజ చేసేవారు. అనంతరం చేప ప్రసాదాన్ని తయారీకి ఉపక్రమించేవారు. తొలుత వీరి కుటుంబ సభ్యులంతా చేప ప్రసాదాన్ని తీసుకునేవారు. ఈ తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీకి శ్రీకారం చుట్టేవారు. ఈసారి ఇవేవీ చేపట్టడంలేదు.
మొదట్లో 50 కిలోల వరకు తయారైన చేప ప్రసాదం ఆ తర్వాత 3.5 క్వింటాళ్లకు చేరుకుంది. కొన్నాళ్ల వరకు చేపమందుగా ప్రాచుర్యం పొందగా.. అనంతర కాలంలో చేప ప్రసాదంగా మారింది. భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ సైతం చేప ప్రసాదం కోసం ఇక్కడికి వచ్చారని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతుంటారు.