సెప్టెంబర్1 వరకు క్వారంటైన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు
By: chandrasekar Sat, 29 Aug 2020 12:37 PM
చెన్నై సూపర్ కింగ్స్లో సుమారు 10
మంది ఆటగాళ్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సమాచారం. ప్రస్తుత భారత బౌలర్, పలువురు జట్టు సిబ్బంది సహా గురువారం నాలుగోసారి కరోనా పరీక్షలు చేయించుకోగా శుక్రవారం వారికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని సమాచారం. కరోనా సోకిన ఆటగాళ్ల పేర్లు తెలియలేదు. సీఎస్కే వారి శిక్షణను నేటి నుంచి స్టార్ట్ చేయకపోవడానికి కారణ౦ ఇదే అని తెలుస్తోంది. దీంతో సీఎస్కే ఆటగాళ్లు తమ స్వీయ నిర్బంధ కాలాన్ని సెప్టెంబర్1 వరకు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆగస్టు 21న సీఎస్కే యూఏఈ చేరగా బీసీసీఐ నిర్దేశించిన ప్రోటోకాల్ ప్రకారం ప్రాక్టీస్కు ముందు మూడుసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ‘ఇటీవల భారతదేశం తరపున ఆడిన ఒక కుడిచేతి మీడియం ఫాస్ట్ బౌలర్తో పాటు కొంతమంది సీఎస్కే సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని’ ఐపీఎల్ సీనియర్ అధికారులు తెలిపినట్లు సమాచారం. దీంతో చెన్నై జట్టుకు క్వారంటైన్ సమయాన్ని మళ్లీ పొడిగించారు. సెప్టెంబర్1 వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు క్వారంటైన్లోనే ఉండనుంది. బీసీసీఐ ఇంతవరకు ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించలేదు. కానీ ఇతర జట్లు ఇప్పటికే తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టాయి.