స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు...
By: chandrasekar Wed, 18 Nov 2020 1:17 PM
ఏపీలో రాష్ట్ర ఎన్నికల
సంఘం ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలతో
చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెలంగాణలో జీహెచ్ఎంసీ
ఎన్నికలు కూడా జరుగుతున్నాయని, ఎన్నికల నిర్వహణ రాజ్యంగపరమైన అవసరమని
వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. స్థానిక
సంస్థల ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గతంలో వేసిన నామినేషన్లతో
పాటు.. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని చంద్రబాబు
డిమాండ్ చేశారు. తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని.. గతంలో జరిగిన అక్రమాలపై సీబీఐ
విచారణ చేయించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను బెదిరించి, తప్పుడు
కేసులు పెట్టి బలవంతంగా ఉపసంహరింపజేశారని ఆరోపించారు. అందుకే ఈసారి కేంద్ర భద్రతా
దళాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల
నిర్వహించిన సమావేశంలోనూ మెజార్టీ పార్టీలు ఇదే అభిప్రాయం చెప్పాయని గుర్తు
చేశారు. మంగళవారం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఈ వ్యాఖ్యలు
చేశారు. తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ నేతలకు
చంద్రబాబు సూచించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పతనం తిరుపతి నుంచే ప్రారంభం కావాలి
అన్నారు. ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులకు అడ్డుకట్ట వేసేందుకు అక్కడి నుంచే
నాంది పలకాలని పిలుపు ఇచ్చారు.