సురక్షిత తాగునీరు , పారిశుద్యం విషయంలో ప్రభుత్వం విఫలం అయింది ...చంద్రబాబు
By: Sankar Thu, 10 Dec 2020 09:53 AM
ఏలూరు నగరం, పరిసర ప్రాంతాల్లో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ (ఆరోగ్య అత్యవసర పరిస్థితి) ప్రకటించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు కోరారు.
ఈ మేరకు హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బుధవారం లేఖ రాశారు. ఏలూరులో బాధితుల సంఖ్య పెరిగిపోవడం, కారణాలు తెలియకపోవడం, వింత వ్యాధిగా ప్రచారం సాగుతుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు భీతిల్లుతున్నారని పేర్కొన్నారు. సురక్షిత తాగునీటి సరఫరా, పారిశుధ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.
చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యంపై రానున్న కాలంలో చూపే దుష్ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని ప్రతి రోగికి ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. ఎక్కడికక్కడ క్విక్ రెస్పాన్స్ టీమ్లను నియమించి సత్వర ఉపశమన చర్యలు చేపట్టాలన్నారు. మొబైల్ మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించాలని, ప్రతి బాధితునికి ఆరోగ్య బీమా, జీవిత బీమా కల్పించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలన్నారు.