Advertisement

  • సోనూసూద్‌కు ఫోన్ ద్వారా అభినందనలు తెలిపిన చంద్రబాబు

సోనూసూద్‌కు ఫోన్ ద్వారా అభినందనలు తెలిపిన చంద్రబాబు

By: chandrasekar Mon, 27 July 2020 08:20 AM

సోనూసూద్‌కు ఫోన్ ద్వారా అభినందనలు తెలిపిన చంద్రబాబు


తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ప్రముఖ సినీ నటుడు సోనూ‌సూద్‌కు ఫోన్ చేసి అభినందించారు. చిత్తూరు జిల్లా కేవీ పల్లి మండలం మహల్రాజపల్లిలో కాడెద్దులుగా మారి కుమార్తెలే తండ్రికి పొలం పనుల్లో సాయపడటంపై సోనూసూద్ స్పందించి ఆ కుటుంబానికి ట్రాక్టర్ అందించిన విషయం తెలిసిందే. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు చంద్రబాబు ఆదివారం రాత్రి ట్వీట్ చేశారు. సోనూసూద్ అందరికీ స్ఫూర్తిదాయకమని చంద్రబాబు అన్నారు. రైతు నాగేశ్వరరావు కుమార్తెల చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు.

మదనపల్లిలో నాగేశ్వరరావు టీ హోటల్ నిర్వహించేవాడు. లాక్‌డౌన్ కారణంగా ఆయన కుటుంబానికి ఉపాధి పోయింది. దీంతో నాగేశ్వరావు కుటుంబంతో కలిసి సొంత గ్రామానికి వెళ్లిపోయారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలకు వ్యవసాయం చేయాలని అనుకున్నాడు. దున్నేందుకు ఎద్దులు లేక సతమతమవుతుంటే ఆయన కన్నబిడ్డలే కాడిపట్టుకుని నడిచారు. వాళ్లిద్దరూ కాడి లాగుతుంటే వెనక నుంచి రైతు, ఆయన భార్య విత్తనాలు వేసుకుంటూ వస్తున్నారు. ఇది ఓ జర్నలిస్ట్ కెమెరా కంటికి చిక్కగా ఆయన తన ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు.

ఈ వీడియో వైరల్ కావడంతో సోనూసూద్ కంట పడింది. వెంటనే సాయం చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. మొదట ఆ రైతులకు ఓ జత ఎద్దులు పంపుతానని వెల్లడించారు. కొంతసేపటి తర్వాత వారికి కావాల్సింది ఎద్దులు కాదు, ఓ ట్రాక్టర్ అని ట్వీట్ చేశారు. వారికి సాయంత్రాని కల్లా ట్రాక్టర్ పంపిస్తానని హామీ ఇచ్చారు. చెప్పిన విధంగానే సోనూసూద్‌ చిత్తూరు జిల్లా మదనపల్లిలో ట్రాక్టర్‌ ఆర్డర్‌ చేశాడు. దీంతో షోరూం నిర్వాహకులు రైతు నాగేశ్వరరావుకు ఆదివారం సాయంత్రం ట్రాక్టర్‌ను అందజేశారు. రైతు నాగేశ్వరరావు కుటుంబానికి సోనూసూద్ అండగా నిలవడంపై సోనూసూద్‌కు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. సోనూ రియల్ హీరో అంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు.

Tags :
|

Advertisement