అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్దామని జగన్ కు చంద్రబాబు సవాల్
By: chandrasekar Tue, 04 Aug 2020 8:29 PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని
రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్దామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి
తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం జగన్ అమరావతికి మద్దతు ఇచ్చి అధికారంలోకి వచ్చిన
తర్వాత మాట తప్పారని ఆయన వ్యాఖ్యానించారు. మాట తప్పినందుకు ప్రభుత్వాన్ని రద్దు
చేసి మళ్లీ ప్రజల్లోకి వెళ్దామని సీఎం జగన్కు చంద్రబాబు సవాల్ విసిరారు. మూడు
రాజధానులు ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని చంద్రబాబు
ప్రశ్నించారు.
ఏపీ రాజధాని కొన్ని
గ్రామాల సమస్య కాదని, ఇది 5 కోట్ల మంది ప్రజల సమస్య అని స్పష్టం చేశారు. ఇది
కులాలు, మతాల
మధ్య సమస్య కాదన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఏపీ ప్రజలను వెన్నుపోటు పొడిచారని
మండిపడ్డారు. రాజీనామాలు చేయడానికి టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని
చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లేందుకు 48 గంటలు
సమయం ఇస్తున్నానని చంద్రబాబు అల్టిమేటం ఇచ్చారు. తనతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలంతా
రాజీనామా చేస్తామని వెల్లడించారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని
చంద్రబాబు డిమాండ్ చేశారు.