Advertisement

  • చైర్‌పర్సన్‌ లక్ష్మీ పార్వతి శపథం...చంద్రబాబును జైలుకు పంపకుండా వదిలేది లేదు

చైర్‌పర్సన్‌ లక్ష్మీ పార్వతి శపథం...చంద్రబాబును జైలుకు పంపకుండా వదిలేది లేదు

By: chandrasekar Sat, 10 Oct 2020 3:14 PM

చైర్‌పర్సన్‌ లక్ష్మీ పార్వతి శపథం...చంద్రబాబును జైలుకు పంపకుండా వదిలేది లేదు


దివంగత ఎన్టీఆర్‌ సతీమణి, ఏపీ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీ పార్వతి తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును జైలుకు పంపేవరకు తాను వదిలేది లేదని శపథం చేశారు. ఈ కేసును విత్ డ్రా చేసుకోమని చంద్రబాబు తనపై ఒత్తిడి తీసుకొచ్చారని, కానీ తాను ఒప్పుకోలేదన్నారు. చంద్రబాబు ఆస్తులకు సంబంధించిన కేసుపై శుక్రవారం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది.

ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సి ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు విషయంలో ఏసీబీ కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టుకు వెళతానని తెలిపారు. అక్కడ కూడా న్యాయం దక్కకుంటే సుప్రీం కోర్టుకు వెళతానని, ఏది ఏమైనా చంద్రబాబును జైలుకు పంపకుండా వదిలేది లేదని వ్యాఖ్యానించారు. ఇక, గతంలోనూ ఈ కేసును ఉపసంహరించుకోవాలని గతంలో చంద్రబాబు తనకు ఫోన్‌ చేసి ఒత్తిడి చేశారని లక్ష్మీపార్వతి ఆరోపణలు చేసారు.

ఇక, చంద్రబాబు ఆస్తులకు సంబంధించిన కేసు విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌పై శుక్రవారం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని, ఆయన ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని లక్ష్మీపార్వతి పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయాలని కోరారు. చంద్రబాబుపై స్టే వేకెట్‌ అయిన వివరాలను ఆమె స్వయంగా కోర్టుకు సమర్పించారు. 1978 నుంచి 2005 వరకు చంద్రబాబు ఆస్తుల వివరాలను ఆమె కోర్టు ముందుంచారు.

లక్ష్మీపార్వతి 2004 ఎన్నికల అఫిడవిట్‌లో చంద్రబాబు చూపిన ఆస్తులపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 1987 నుంచి 2005 వరకు చంద్రబాబు అక్రమంగా తన వ్యక్తిగత ఆస్తులను పెంచుకున్నారంటూ ఆమె తన ఫిర్యాదులో తెలియచేసారు. ఏసీబీ కేసు కొనసాగుతున్న నేపథ్యంలో 2005లో హైకోర్టు నుంచి చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. అయితే ఇటీవలే ఆ స్టే వెకేట్‌ అయింది. ఈ తరుణంలో ప్రజాప్రతినిధుల కేసుల విచారణలో భాగంగా చంద్రబాబు ఆస్తుల కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. ప్రజా ప్రతినిధుల కేసుల విచారణలో భాగంగా దర్యాప్తు ముమ్మరం కానుంది.

Tags :
|

Advertisement