2021 ఫిబ్రవరి నాటికి కోవిడ్ వ్యాక్సిన్...సీరం సీఈవో
By: chandrasekar Fri, 20 Nov 2020 4:14 PM
కరోనా వ్యాక్సిన్ను
అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి భారత ఫార్మ
దిగజం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా జతకట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ
వ్యాక్సిన్ ఎప్పటికల్లా అందుబాటులోకి వస్తుందన్న విషయంపై సీరం సంస్థ సీఈవో అదర్
పూనావాలా గురువారం కీలక ప్రకటన
చేశారు. 2021 ఫిబ్రవరి నాటికి
వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అదర్ పునావాలా తెలిపారు. ముందుగా ఆక్స్ఫర్డ్
కరోనా వ్యాక్సిన్ను ఆరోగ్య సిబ్బందికి, వయసు పైబడిన వారికి అందించనున్నట్లు ఆయన తెలిపారు.
అయితే సామాన్య ప్రజలందరికీ ఈ వ్యాక్సిన్ ఏప్రిల్లో అందుబాటులోకి వస్తుందని ఆయన
ప్రకటించారు.
పూనావాలా ఈ వ్యాక్సిన్ ధర
రెండు డోసులకుగానూ దాదాపుగా రూ.1000 వరకూ ఉండవచ్చని పేర్కొన్నారు. అయితే దేశంలోని
అందరికీ 2024
నాటికి వ్యాక్సిన్ లభిస్తుందని పూనావాలా చెప్పారు. అయితే ఇప్పటికే నాలుగు కోట్ల
కరోనా వ్యాక్సిన్ డోసులను సిద్ధం చేశామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో
అదర్ పూనావాలా పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ నియంత్రణ సంస్థల నుంచి సరైన సమయంలో
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్కు ఆమోదం లభిస్తే 2021 జనవరి లోపు ఈ వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం
ఉందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్
కోవిషీల్డ్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ను సీఐఐ, ఐసీఎంఆర్ నిర్వహిస్తున్న
సంగతి తెలిసిందే.