కేంద్రం నుంచి వీలైనంత సహకారం అందేలా చూస్తాము ...ఏపీకి హామీఇచ్చిన కేంద్ర బృందం
By: Sankar Wed, 11 Nov 2020 10:13 PM
రాష్ట్రంలో గత నెలలో సంభవించిన భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందం బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యింది.
కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్రాయ్ నేతృత్వంలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం రెండు రోజుల పాటు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరుతో పాటు, అనంతపురం జిల్లాలో పర్యటించింది. అనంతపురం జిల్లాలో వేరుశనగ పంటకు భారీగా నష్టం జరిగినందువల్ల, అక్కడ పర్యటించాలన్న సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి మేరకు కేంద్ర బృందం ఆ జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేసింది.
రాష్ట్రంలో పర్యటన కాస్త ఆలస్యం అయినప్పటికీ భారీ వర్షాలు, వరదల వల్ల రైతులకు కలిగిన నష్టాన్ని అంచనా వేశామని బృందానికి నేతృత్వం వహిస్తున్న సౌరవ్రాయ్ వెల్లడించారు. తమ పర్యటనలో జిల్లాల అధికారులు బాగా సహకరించారని, నష్టంపై సమగ్ర సమాచారం అందించారని బృందం పేర్కొంది. రైతులకు జరిగిన నష్టంపై కేంద్రానికి పూర్తి నివేదిక ఇస్తామని, వీలైనంత సహకారం అందేలా చూస్తామని కేంద్ర బృందం హామీ ఇచ్చింది