మనం ఆ దశకు చేరుకోలేదు ..రికవరీ రేట్ కూడా గణనీయంగా పెరుగుతుంది ..కేంద్ర ఆరోగ్య మంత్రి
By: Sankar Tue, 14 July 2020 6:06 PM
ఇండియాలో కరోనా కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయి ..రోజుకి దాదాపు 30 వేలకు దగ్గరలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి ..ప్రస్తుతం తొమ్మిది లక్షలకు పైగా కరోనా కేసులతో ఇండియా ప్రపంచంలోనే మూడో స్థానములో ఉంది ..కేవలం అమెరికా , బ్రెజిల్ మాత్రమే మనకంటే ముందు ఉన్నాయి .. దీంతో భారత్లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్(సామాజిక వ్యాప్తి) నడుస్తోందని చాలామంది భావిస్తున్నారు. ఆరోగ్య నిపుణులు సైతం ఈ దశలోకి మనం అడుగుపెట్టామని వాదిస్తున్నారు.
అయితే ఈ వ్యాఖ్యలను మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రి డా.హర్షవర్దన్ కొట్టిపారేశారు. దేశం ఇంకా సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ధారావి, ముంబై వంటి వంటి ప్రదేశాల్లో స్థానిక సంక్రమణ ప్రారంభమైనప్పటికీ దాన్ని సమర్థవంతంగా నియంత్రించామని తెలిపారు. ముఖ్యంగా దేశంలో కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ రికవరీ రేటు దాదాపు 60 శాతంగా ఉండటం సానుకూల అంశంగా పేర్కొన్నారు..
మరణాల్లోనూ ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో మరణాల సంఖ్య తక్కువగానే ఉందన్నారు. ఈ మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ అభివృద్ధికి సమయం పడుతుందని, కానీ అందుకు నెల, సంవత్సరమా అన్న విషయం ఎవరూ చెప్పలేరన్నారు. కాగా కోవ్యాక్సిన్ను ఆగస్టు 15 నాటికి అందరికీ అందుబాటులోకి తెస్తామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) ప్రకటన జారీ చేసి నాలుక్కరుచుకున్న విషయం తెలిసిందే. దీనిపై అనేక విమర్శలు, అభ్యంతరాలు వెల్లువెత్తడటంతో అత్యంత వేగవంతంగా వ్యాక్సిన్ తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేసింది.