అక్టోబర్ 15 నుంచి తెరుచుకోనున్న థియేటర్స్ ...మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
By: Sankar Tue, 06 Oct 2020 4:17 PM
అన్లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు 50 శాతం సీటింగ్ సామర్థ్యంలో తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలోనే థియేటర్లు తెరిచిన తర్వాత పాటించాల్సిన నియమాలపై తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.
ఇందులో భాగంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో ముచ్చటించారు. దాదాపు ఏడు నెలలు తర్వాత అన్లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15న దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు రీ-ఓపెన్ కానున్నాయని ఆయన అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పలు మార్గదర్శకాలను రూపొందించామని.. అవి తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
1. 50 శాతం మించి ప్రేక్షకులను థియేటర్లలోకి అనుమతించకూడదు.
2. థియేటర్లలో భౌతిక దూరం పాటించాలి.
3. ఖాళీగా వదిలేసిన సీట్లపై మార్కింగ్ వేయాలి.
4. థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత ప్రేక్షకులను అనుమతించాలి.
5. శానిటైజర్లు అన్ని చోట్లా అందుబాటులో ఉంచాలి.
6. బాక్స్ ఆఫీస్ దగ్గర టికెట్ కౌంటర్లు రోజు మొత్తం ఓపెన్ చేయాలి.
7. అందరూ ఆరోగ్య సేతు యాప్ను ఇన్స్టాల్ చేసుకునేలా చూడాలి.
8. ఎక్కువగా ఆన్లైన్ పేమెంట్స్ను ప్రోత్సహించాలి.
9. బాక్స్ ఆఫీస్, సినిమా థియేటర్ పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి.
10. బాక్స్ ఆఫీస్ దగ్గర క్యూలైన్లలో భౌతిక దూరం పాటించేలా మార్కింగ్ చేయాలి
11. థియేటర్లలో ప్యాకేజ్డ్ ఫుడ్స్కి మాత్రమే అనుమతి.
12.మాస్క్ తప్పనిసరి