స్కూళ్లు, కాలేజీలను తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్
By: chandrasekar Tue, 26 May 2020 4:35 PM
దేశంలో స్కూళ్లు, కాలేజీలను తిరిగి ప్రారంభించేందుకు ఏం చెయ్యాలి? ఎలా ప్రారంభించాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం
దృష్టిసారిస్తోంది. ప్రధానంగా జోన్లను బట్టీ ఏయే స్కూళ్లలో ఎలాంటి రూల్స్
ఉండాలన్నది ఓ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ముందుగా స్కూళ్లు తెరిచాక 8 నుంచి 12వ
తరగతి విద్యార్థులను మాత్రమే ముందుగా స్కూళ్లకు అనుమతిస్తారని తెలుస్తోంది. మిగతా
అన్ని తరగతుల స్కూళ్లూ తెరిచిన తర్వాతే ప్రి-ప్రైమరీ స్కూళ్లను తెరవడం మేలనే
ప్రతిపాదనను NCERT... డ్రాప్ట్
గైడ్లైన్స్లో పెట్టినట్లు తెలిసింది.
ఇంతకు ముందు స్కూళ్లు
తెరిచిన తర్వాత ముందుగా ఒకేసారి 30 శాతం
మంది విద్యార్థులను మాత్రమే అనుమతించాలనే అంశాన్ని కేంద్రం పరిశీలిచింది. కానీ
చిన్నారులకు కరోనా సోకితే ఎక్కువ ప్రమాదం కాబట్టి వాళ్ల విషయంలో మరింత ఎక్కువ
జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిసింది. పెద్ద తరగతుల విద్యార్థులైతే
వాళ్లకు కరోనాపై పూర్తి అవగాహన ఉంటుంది. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టాన్స్ పాటించడం ఇలా అన్ని జాగ్రత్తలూ
తీసుకుంటారు. అందువల్ల వాళ్లనే ముందుగా స్కూళ్లకు రప్పించాలని కేంద్ర మానవ వనరుల
మంత్రిత్వ శాఖ (HRD) భావిస్తున్నట్లు
తెలిసింది. ఆరోగ్యం, హోమ్
శాఖలతో చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ వారంలోనే గైడ్లైన్స్ రిలీజ్
చేయనుంది.
దేశంలోని కరోనా ప్రభావిత
రెడ్ జోన్, ఆరెంజ్
జోన్, గ్రీన్ జోన్లో ఒక్కో చోట ఒక్కోలా స్కూళ్ల ప్రారంభం
ఉంటుందని తెలిసింది. ముందుగా గ్రీన్, ఆరెంజ్
జోన్లలో స్కూళ్లనే తెరుస్తారని తెలిసింది. గత వారం కేంద్రం కేంద్రీయ విద్యాలయాల్లో
పెండింగ్ అడ్మిషన్లకు ఇదే రూల్ ఫాలో అయ్యింది. కేంద్రీయ విద్యాలయాల అడ్మిషన్లు
సాధారణంగా మార్చిలో జరుగుతాయి. కరోనా వైరస్ కేసులు పెరుగుతుంటే, అవి వాయిదా పడ్డాయి. ఇప్పుడా అడ్మిషన్లు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రమే ప్రారంభమయ్యాయి.
స్కూళ్లు ఎప్పుడు
తెరిచేదీ ఇప్పుడే డేట్ ఫిక్స్ చేయలేమన్న కేంద్ర వర్గాలు జులైలో ప్రారంభించి 30 శాతం హాజరయ్యేలా చేసే ఆలోచన ఉందని తెలిపాయి. కేంద్రం
జారీ చేసే గైడ్లైన్స్లో టీచర్లకు ప్రత్యేక ట్రైనింగ్ కూడా ఉండబోతోందని
తెలిసింది. విద్యార్థులు సోషల్ డిస్టాన్స్ పాటించేందుకు ఏం చెయ్యాలి, మాస్కులతో ఇబ్బంది కలిగితే ఏం చెయ్యాలి వంటి అంశాలపై
ట్రైనింగ్ ఉంటుందని సమాచారం. స్కూళ్లు తెరిచాక మాత్రం చాలా మార్పులు ఉంటాయని
తెలుస్తోంది. స్కూళ్లలో అసెంబ్లీలు కూడా లేకుండా చేస్తారని సమాచారం.
ప్రస్తుతం కొన్ని
స్కూళ్లు వారానికి ఐదు రోజులే నడుస్తున్నాయి. కానీ కేంద్రం వారానికి ఆరు రోజులు
స్కూల్ నడపాల్సిందే అనే కండీషన్ పెట్టబోతున్నట్లు తెలిసింది. ఆన్లైన్లో క్లాసులు
నిర్వహించినా ఆరు రోజుల రూల్ తప్పనిసరి చేయబోతున్నట్లు సమాచారం.
మన స్కూళ్లలో తరగతి గదులు
చిన్నగా ఉంటాయి. 40 మంది
పట్టే క్లాసులో ఇప్పుడు 20
మందినే ఉంచాల్సి ఉంటుంది. టీచర్ల సంఖ్య కూడా తక్కువే. అందుకే ఉదయం, మధ్యాహ్నం వేళ కింద రెండు షిఫ్టుల్లో క్లాసులు
నిర్వహించాలనే కండీషన్ తేబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లు టీచర్లతో
మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సరిసంఖ్య ఉన్న విద్యార్థులు ఓ రోజు బేసి సంఖ్య ఉన్న
విద్యార్థులు మరో రోజు క్లాసులకు వచ్చేలా రూల్ తెచ్చే ఆలోచన కూడా ఉంది. స్కూల్కి
రాని విద్యార్థులు ఇంటి దగ్గర ఆన్లైన్ క్లాసులు చదవాల్సి ఉంటుంది. డౌట్స్ ఉంటే
మర్నాడు స్కూల్కి వెళ్లినప్పుడు తీర్చుకోవచ్చనే ప్రతిపాదన కూడా ఉంది.
తల్లిదండ్రులే పిల్లల్ని
స్కూళ్లకు తెచ్చి దింపాలనే ప్రతిపాదన ఉంది. వీలైనంత వరకూ స్కూల్ బస్సులు లేకుండా
చేస్తారనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో స్కూల్ బస్సుల్లో
సోషల్ డిస్టాన్స్ కష్టమని కేంద్రం భావిస్తోంది. అందుకే పిల్లల్ని పెద్దవాళ్లే
తెచ్చి దింపితే మంచిదంటున్నారు. ఒకే సమయంలో కొందరు విద్యార్థులకు ఆన్లైన్ కొందరు
విద్యార్థులకు ఆఫ్లైన్లో క్లాసులు నిర్వహించే ఆలోచన కూడా ఉంది. ఇది కూడా సరి
బేసి విధానం లాంటిదే. స్కూల్కి రాని పిల్లలు ఇంటి దగ్గరే ఆన్లైన్ క్లాసుల ద్వారా
చదువుకుంటారు. స్కూల్కి వచ్చేవారు డైరెక్టుగా చదువుకుంటారు. ఎలా చదివినా కరోనా
సమస్య రాకుండా, బాగా
చదువుకునేలా చూడాలన్నదే కేంద్రం ఆలోచనగా తెలుస్తోంది.