Advertisement

  • హైవే ప్రాజెక్టుల్లో చైనా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరణ

హైవే ప్రాజెక్టుల్లో చైనా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరణ

By: chandrasekar Thu, 02 July 2020 10:48 AM

హైవే ప్రాజెక్టుల్లో చైనా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరణ


భారత ప్రభుత్వం చైనాకు మరో షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఇప్పటికే చైనా సంస్థలకు చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా హైవే ప్రాజెక్టుల్లో చైనా సంస్థలకు అనుమతి నిరాకరించనున్నట్లు తెలిపింది.

త్వరలో హైవే ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలపై నిషేధం విధించనున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం తెలిపారు. దీనికి సంబంధించిన త్వరలో విధి విధానాలు రూపొందించనున్నట్లు ఆయన వెల్లడించారు.

దీంతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు, వివిధ రంగాల్లో చైనా పెట్టుబడిదారులను ప్రోత్సహించకూడదని ఇటీవల జరిగిన మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కేవలం చైనా సంస్థలకే కాదు, చైనాతో భాగస్వామ్యం ఉన్న ఎలాంటి సంస్థలకూ హైవే ప్రాజెక్టుల్లో కాంట్రాక్టులకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించినట్లు నితిన్ గడ్కరీ తెలిపారు.

జాయింట్ వెంచర్ ప్రాజెక్టుల నుంచి చైనాతో సంబంధం ఉన్న సంస్థలకు అనుమతి నిరాకరించనున్నట్లు స్పష్టం చేశారు. భారత కంపెనీల అర్హత ప్రమాణాలు పెంపొందించేలా నిబంధనల సడలింపు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో దేశంలో కొనసాగుతున్న కొన్ని ప్రాజెక్టుల్లో చైనా సంస్థలు పనిచేస్తున్నాయని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న, భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించి చైనా సంస్థలకు అనుమతులు ఇవ్వకుండా కచ్చితమైన నిబంధనలు తీసుకురానున్నట్లు మంత్రి వివరించారు.

సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వరుస నిర్ణయాలతో చైనాకు షాక్ ఇస్తోంది. గల్వాన్ ఘర్షణల్లో 20 మంది సైనికులు అమరులైన ఘటనను తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటన తర్వాత దేశంలోనూ చైనాపై ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ఓ వైపు సరిహద్దులో సైన్యాన్ని అన్ని రకాలుగా సిద్ధం చేస్తూనే మరోవైపు చైనా ఆర్థిక మూలాలపై దెబ్బ తీసే చర్యలు చేపట్టింది. 59 యాప్‌లపై నిషేధం విధించడంతో చైనా పాలకులు ఆందోళనకు గురవుతుండగా భారత ప్రభుత్వం మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. 5జీ సేవలను కూడా నిలిపివేసే యోచనలో ఉంది. భారత్‌తో పాటు మరిన్ని దేశాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే చైనా ఆర్థిక మూలాలకు గట్టి దెబ్బ పడుతుంది. ఇప్పుడు డ్రాగన్‌ను కలవరపెడుతున్న అంశమిదే.

Tags :
|

Advertisement