జగన్ సర్కార్కు కేంద్రం షాక్ …
By: chandrasekar Mon, 19 Oct 2020 11:43 AM
కేంద్రం ఆంధప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ బిల్లు-2019ని వెనక్కు పంపింది. ఈ బిల్లులో కొన్ని సాంకేతిక
లోపాలు ఉన్నాయని.. వాటిని సరిచేయాలని సూచించినట్లు తెలుస్తోంది.. సరిచేసి పంపాలని
కేంద్రం సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చట్టాన్ని వ్యతిరేకించకపోయినా.. బిల్లు
రూపకల్పనలో కొన్ని అంశాలు ఇబ్బందిగా మారినట్లు సమాచారం. ఐపీసీ, సీఆర్పీసీలో మార్పులు చేయకుండా అమలు చేసే పరిస్ధితి
లేదట.ఏపీ అసెంబ్లీలో ఆమోదం సందర్భంగా దిశ బిల్లు....రాష్ట్రానికి మాత్రమే
వర్తించేలా ఐపీసీలో కొత్తగా 354ఈ, 354ఎఫ్, 354జీ
సెక్షన్లను చేర్చారు. ఐపీసీలో చేసే మార్పుల ప్రకారం ఏపీకి మాత్రమే వర్తింపజేయాలి.
నిందితులకు కఠిన శిక్షల కోసం ఐపీసీలో కేవలం ఏపీ వరకే వర్తించేలా సెక్షన్లు
మారిస్తే మిగతా రాష్ట్రాలు మార్పులు కోరవచ్చు. అప్పుడు మొత్తం ఐపీసీ అమలే
ప్రశ్నార్ధకంగా మారుతుందట.. అంతిమంగా ఐపీసీనే ప్రక్షాళన చేయాల్సి వస్తుందట. అందుకే
ఈ బిల్లును తిరస్కరించారనే చర్చ జరుగుతోంది.
కేంద్రం పలు లోపాలు, అభ్యంతరాలున్నాయంటూ
దిశ బిల్లును ఆమోదించకుండా వెనక్కి పంపడం జగన్ సర్కార్కు ఇబ్బందిగా మారింది.
కేంద్రం వెనక్కు పంపిన ఈ బిల్లులో తగిన సవరణలు చేసి తిరిగి అసెంబ్లీలో ఆమోదిస్తే
కానీ కేంద్రానికి పంపే అవకాశం ఉండదు. దీని కోసం ముసాయిదా సవరణ బిల్లును తీసుకొచ్చి
అసెంబ్లీ ఆమోదం పొంది కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. అప్పుడు కేంద్రం ఓకే అంటేనే
చట్టం అవుతుంది.. లేకపోతే మళ్లీ కథ మొదటికి వచ్చినట్లే.ఈ బిల్లు ప్రకారం పక్కా
ఆధారాలు ఉంటే.. అత్యాచార కేసుల దర్యాప్తును వారం రోజుల్లో పూర్తి చేయడంతోపాటు.. 14 రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేసి.. 21 రోజుల్లోనే శిక్షలు ఖరారవుతాయి. మొన్నటి వరకు ఈ కేసుల
విచారణకు 4 నెలల సమయం పడుతుండగా.. ఇక నుంచి మూడు వారాల్లోనే
తీర్పు వెలువడుతుంది. అలాగే మహిళలు, చిన్నారులపై
నేరాలకు సంబంధించిన కేసుల విచారణ కోసం జిల్లాకో కోర్టు చొప్పున ఏర్పాటు
చేయనున్నారు. ఈ న్యాయస్థానాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లా పని చేస్తాయి. మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలను మాత్రమే ఈ కోర్టుల్లో
విచారణ జరుగుతాయి.
మహిళలు, చిన్నారులను
కించపరుస్తూ.. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటారు.
మొదటిసారి తప్పు చేస్తే రెండేళ్లు, రెండోసారి
తప్పు చేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధిస్తారు. చిన్నారులపై లైంగిక దాడులకు
పాల్పడితే ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం గరిష్టంగా ఐదేళ్ల శిక్ష మాత్రమే
పడుతుంది. కాగా.. నేరాల్లో తీవ్రతను బట్టి వారికి గరిష్టంగా జీవిత ఖైదు విధించేలా
బిల్లు రూపొందించారు. అసెంబ్లీలో ఆమోదించి.. చట్ట రూపం ఇచ్చేందుకు కేంద్రానికి
పంపించారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దిశ పోలీస్ స్టేషన్లు కూడా
ప్రారంభమయ్యాయి.