కరోనా లక్షణాలు ఉన్నవారికంటే లేని వారే మహా డేంజర్ ..
By: Sankar Mon, 21 Sept 2020 11:25 AM
కరోనా వైరస్ భయంతో కొందరు తమలో ఏ మాత్రం లక్షణాలు కనిపించినా ఆందోళన చెందుతున్నారు. సాధారణ జలుబు, జ్వరం వచ్చినా కరోనా అని భయపడి ఆందోళన చెందుతున్నారు. అయితే కొందరు మాత్రం కరోనా బారిన పడుతున్నా వారిలో ఏ మాత్రం కరోన లక్షణాలు కనిపించడం లేదు.
అయితే అలాంటి వారిలో వైరస్ లోడు అధికంగా ఉంటుందని ఓ సర్వేలో తేలింది. కోవిడ్ లక్షణాలు ఉన్నవారి కంటే...ఏ లక్షణాలు లేని అసింప్టమేటిక్ బాధితుల్లోనే వైరస్ లోడు ఎక్కువగా ఉన్నట్లు హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ సర్వేలో స్పష్టమైంది. అంతేకాదు 95 శాతం మందిలో 20 బి క్లేడ్ స్ట్రెయిట్ రకం వైరస్ ఉన్నట్లు తేలింది.
మే, జూన్ మాసాల్లో గ్రేటర్ సహా...శివారు ప్రాంతాల్లో కరోనా వైరస్ బారిన పడిన 210 మంది డేటాను సేకరించారు. ఆ డేటాను విశ్లేషించగా ఈ విషయం స్పష్టమైంది. వైరస్ లోడుకు తోడు... అదేస్థాయిలో ఇమ్యునిటీ లెవల్స్ ఉండటం వల్లే వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు బయటికి కనిపిస్తున్నట్లు స్పష్టం చేసింది. వీరి నుంచి ఇమ్యునిటీ లెవల్స్ తక్కువగా ఉన్న వారికి వైరస్ వ్యాపించి, వారి మృత్యువాతకు కారణమవుతున్నట్లు సర్వేలో గుర్తించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 57 వేల మంది వైరస్ బారిన పడ్డారు. వీరిలో 70 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. కేవలం 30 శాతం మందిలోనే జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కన్పించాయి. కోవిడ్ లక్షణాలు ఉన్న వారితో పోలిస్తే...ఏ లక్షణాలు లేని అసింప్టమాటిక్ బాధితుల్లోనే వైరస్ లోడు ఎక్కువగా ఉన్నట్లు సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు.
వీరి నుంచి వృద్ధులు, పిల్లలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి వైరస్ విస్తరించి, పరోక్షంగా వారి మృత్యువాతకు కారణమవుతున్నట్లు తేలింది. ఈ పరిశోధన వివరాలు ‘బయో ఆరెక్సీవ్’ అనే ప్రీప్రింట్ రీపాజిటరీలో ఇటీవల పబ్లిష్ కావడం గమనార్హం.