హైదరాబాద్లో రెచ్చిపోయిన దొంగలు..రూ.40 లక్షల విలువైన సెల్ఫోన్లను దోచేశారు...!
By: Anji Sat, 14 Nov 2020 4:23 PM
పండుగ పూట దొంగలు రెచ్చిపోయారు. నగరం కాంతుల మయంతో నిండి ఉన్న సమయంలో కూడా పక్కా ప్లాన్తో దోచేశారు. నగర శివారు మియాపూర్ పీఎస్ పరిధి మదీనాగూడలోని రిలయన్స్ డిజిటల్ షోరూంలో భారీ చోరీ జరిగింది.
సుమారు రూ.40 లక్షల విలువైన సెల్ఫోన్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఉదయం షోరూంను తెరిచి లోపలికి వెళ్లి చూడగా వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడి ఉండటాన్ని గమనించిన స్టాఫ్ స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఐదు స్పెషల్ టీమ్స్ను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. సెల్ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రికల్ వస్తువులు ఏమైనా చోరీకి గురయ్యాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి దొంగల హస్తం ఉందోమో అని సిబ్బందిని విచారిస్తున్నారు.
నేషనల్ హైవే ముందే ఉన్న ఈ షాపులో దీపావళి పండుగ రోజునే చోరీ జరగడం స్థానికంగా కలకలం రేపింది. పండుగ పూట కాస్త గిరాకీ ఎక్కువగా ఉంటుందని భావించిన నిర్వాహకులకు.. చోరీ ఉదంతం షాక్ ఇచ్చింది. దీంతో యాజమాన్యం షాపును మూసేసింది.