బోనాలకు అనుమతి ఇస్తే ..కరోనాకు అనుమతి ఇచ్చినట్లే ..వైద్య ఆరోగ్య శాఖ నివేదిక
By: Sankar Wed, 10 June 2020 12:46 PM
తెలంగాణ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకొనే బోనాల పండుగపైనా కరోనా ప్రభావం పడనుంది. రాష్ట్రంలో రోజురోజుకూ వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి బోనాలకు పచ్చజెండా ఊపితే కేసుల విస్ఫోటం తప్పదని వైద్య, ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు ఆ శాఖ ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్కు నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. ఏటా ఆషాఢ మాసం ప్రారంభం మొదలు ముగిసే వరకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో బోనాల సందడి ఉంటుంది. తొలుత గోల్కొండ బోనాలు, తర్వాత లష్కర్, చివరికి లాల్దర్వాజ బోనాలతో ఈ సంబురాలు ముగుస్తాయి.
ఆ తర్వాత శ్రావణ మాసంలో తెలంగాణ అంతటా బోనాల పండుగ జరుపుకొంటారు. ఈ వేడుకల్లో లక్షలాది మంది పాల్గొంటారు. దేవతలకు బోనాలు సమర్పించడంతోపాటు మద్యం సేవించి, మాంసాహార వంటకాలతో విందు చేసుకుంటారు. ఇది రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు బంధు మిత్రులతో కలిసి సామూహికంగా జరుపుకొనే పండుగ. ఈ నెల 22 నుంచి ఆషాఢ మాసం మొదలవుతుండగా, బోనాల పండుగ ఏర్పాట్లకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. కానీ, రాష్ట్రంలో కరోనా వ్యాధి ప్రబలుతున్న క్రమంలో బోనాల పండుగకు అనుమతించడం శ్రేయస్కరం కాదని వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. బోనాల సందర్భంగా లాక్డౌన్ నిబంధనలు, భౌతిక దూరం పాటించరని, ప్రజలు గూమిగూడకుండా నియంత్రించడం పోలీసులకూ సాధ్యపడదని, ఇది కరోనా వైరస్ విజృంభణకు దారి తీస్తుందని కేసీఆర్కు సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.
కరోనా వైరస్ బయటపడ్డ తొలినాళ్లలో ఇటలీ, ఇరాన్ వంటి దేశాలు మత సంబంధమైన కార్యక్రమాలకు అనుమతించడమే అక్కడ పరిస్థితి అదుపు తప్పడానికి ప్రధాన కారణమని నివేదికలో వివరించింది. అలాగే మన దేశంలో మర్కజ్ ఉదంతం సృష్టించిన కలకలాన్ని పొందుపర్చింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఆలయాలు తెరవడం సహా లాక్డౌన్కు అనేక సడలింపులు ఇచ్చినప్పటికీ, మత సంబంధమైన కార్యక్రమాలకు ఇప్పటికీ అనుమతి ఇవ్వకపోవడాన్ని గుర్తుచేసింది. ఈ పరిస్థితుల్లో బోనాల పండుగకు అనుమతి ఇస్తే, కరోనా కొత్త కేసులను కొని తెచ్చుకున్నట్లేనని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్ను కలిసినప్పుడు కూడా స్పష్టం చేసినట్లు తెలిసింది.