డాక్టర్ సుధాకర్ కేసుపై సీబీఐ విచారణ
By: chandrasekar Sat, 30 May 2020 5:39 PM
విశాఖ డాక్టర్ సుధాకర్
కేసులో సీబీఐ రంగంలోకి దిగింది.. దర్యాప్తు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
ఆదేశాలతో డాక్టర్ సుధాకర్ చికిత్స పొందుతున్న విశాఖ ప్రభుత్వ మానసిక వైద్యశాలకు
సీబీఐ అధికారులు చేరుకున్నారు. సుధాకర్ నుంచి వాంగ్మూలం తీసుకుంటున్నారు. అలాగే ఈ
కేసుకు సంబంధించి అంశాలు, తాజా
పరిణామాలపై ఆరా తీయనున్నారు. సీబీఐ అధికారులు శుక్రవారం పోలీసులపై ఎఫ్ఐఆర్
నమోదుచేశారు.
డాక్టర్ సుధాకర్
అభియోగాల మేరకు విశాఖపట్నంలో పోలీసులు, ప్రభుత్వ
ఉద్యోగులు, మరికొందరిపై
120-బీ, 324, 343, 379, 506 సెక్షన్ల కింద కేసులు ఫైల్ అయ్యాయి. నేరపూరిత కుట్ర, కావాలని దూషించడం, మూడు
రోజులకు పైగా అక్రమ నిర్బంధం, దొంగతనం, బెదిరింపులకు పాల్పడ్డారంటూ వీరిపై అభియోగాలు
నమోదయ్యాయి. ఈ నెల 16న
డాక్టర్ సుధాకర్ను విశాఖ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుధాకర్
మానసిక పరిస్థితి సరిగా లేదని కేజీహెచ్ వైద్యులు చెప్పడంతో పోలీసులు ప్రభుత్వ
మెంటల్ ఆస్పత్రికి తరలించారు.
డాక్టర్ సుధాకర్ విషయంలో
విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరుపై వీడియోలతో ఏపీ టీడీపీ రాష్ట్ర మహిళా
అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. దీంతో కోర్టు ఈ లేఖను సుమోటో
పిల్గా పరిగణించి విచారణ జరిపింది. అలాగే మరో వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
విశాఖ మెంటల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు ప్రభుత్వం కోర్టులో కౌంటర్ దాఖలు
చేసింది. దీంతో కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సుధాకర్ చికిత్సపొందుతున్న
ఆస్పత్రికి వెళ్లి వాంగ్మూలం నమోదు చేయాలని విశాఖ సెషన్స్ జడ్జిని ఆదేశించింది.
గురువారం సాయంత్రంలోగా
వాంగ్మూలాన్ని హైకోర్టుకు సమర్పించాలని సూచించింది. తర్వాత సుధాకర్ స్టేట్మెంట్
పరిశీలించి ఈ కేసును సీబీఐకి అప్పగించింది. డాక్టర్ సుధాకర్ విశాఖ జిల్లా
నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. కరోనా సమయంలో ఆస్పత్రిలో
మాస్కులు, పీపీఈ కిట్లు లేవంటూ ఆరోపించారు. ఆ తర్వాత ప్రభుత్వం
ఆయన్ను సస్పెండ్ చేసింది. ఈ నిర్ణయంపై విపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. సుధాకర్పై
సస్పెన్షన్ ఎత్తేయాలని డిమాండ్ చేశారు.