పీఎం కిసాన్ పథకంలో భారీ కుంభకోణంపై సీబీసీఐడీ దర్యాప్తు
By: chandrasekar Fri, 11 Sept 2020 3:01 PM
రైతుల సంక్షేమం కోసం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భారీ
కుంభకోణం తమిళనాడులో బయటపడింది. ఈ పథకానికి సంబంధించిన నిధుల్లో రూ.110 కోట్ల
మేరకు అవినీతి జరిగింది. మొత్తం 5.5 లక్షల మంది అనర్హుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.2000
చొప్పున రూ.110 కోట్లను జమచేశారు. ఈ విషయాన్ని తమిళనాడు వ్యవసాయ
శాఖ ముఖ్యకార్యదర్శి గగన్దీప్ సింగ్ పేర్కొన్నారు.
భారీ స్థాయిలో అవినీతి జరుగడంతో
ఈ కుంభకోణంపై సీబీసీఐడీ దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. పేద రైతుల
బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేసే ఈ పథకంలో అక్రమాలు జరిగాయని, పలు
జిల్లాల్లో నకిలీ పత్రాలతో రైతుల పేరిట రూ.కోట్లు దోచుకొన్నారని వార్తలు వచ్చిన
కారణంగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 34
అధికారులపై చర్యలు చేపట్టామని,
18 మంది ఉద్యోగులను అరెస్ట్ చేశామని, మరో 80
తాత్కాలక సిబ్బందిని డిస్మిస్ చేశామని బేడీ చెప్పారు.
రాష్ట్రంలోని 13
జిల్లాల్లో అవినీతి జరిగినట్టు అందిన ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు చేపట్టినట్టు
తెలిపారు. మొత్తం రూ.110 కోట్ల
కుంభకోణానికి సంబంధించి ప్రభుత్వం రూ.32 కోట్లను స్వాధీనం చేసుకుందని, రాబోయే
40
రోజుల్లో మిగిలిన డబ్బును కూడా రికవరీ చేస్తామని గగన్దీప్ సింగ్ చెప్పారు.
రాష్ట్రంలోని కలకూరిచి, విల్లుపురం, కడలూరు, తిరువన్నమలై, వెల్లూరు, రాణిపేట, సేలం, ధర్మపురి, కృష్ణగిరి, చెంగల్పేట జిల్లాల్లో ఈ కుంభకోణం జరిగిందని
తెలిపారు. కాగా, ఈ కుంభకోణంపై ప్రతిపక్ష డీఎంకే సీబీఐ దర్యాప్తు జరిపించాలని
డిమాండ్ చేస్తున్నది.