హౌస్ ఫర్ ఆల్ అనే నినాదంతో సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారు ...ఎమ్యెల్యే మల్లాది విష్ణు
By: Sankar Fri, 20 Nov 2020 7:28 PM
ప్రజల సమస్యలు పరిష్కరించడమే వైఎస్సార్సీపీ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాజీవ్ నగర్, కండ్రిక ప్రాంతాల్లో ప్రజలు నాడు.. ప్రజల కోసం నేడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గడపగడపకు తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడుని చిత్తుగా ఓడించినా బుద్ధి రాలేదని, బాబు పరిపాలనలో అమరావతి, పోలవరం నాశనం చేశాడని ఆరోపించారు. చంద్రబాబు 40 సంవత్సరాల చరిత్ర అని చెప్పుకోవడమే కానీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని మల్లాది విష్ణు అన్నారు.
సీఎం జగన్ ఈ రాష్ట్రంలో హౌస్ ఫర్ ఆల్ అనే నినాదంతో ముందుకు వెళ్లతున్నారని, డిసెంబర్ 25 నాటికి 30 లక్షల మందికి ఇళ్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఈ విషయంపై కూడా చంద్రబాబు కోర్టుకెళ్లి అడ్డుకున్నాడని పేర్కొన్నారు. గతంలొ టీడీపీ నేతలు పేద ప్రజల వద్ద నుంచి ఇల్లు ఇస్తామని రూ.25 ,50 వేలు వసూలు చేశారని ధ్వజమెత్తారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ. 400 కోట్లతో అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టామని, రాబోయే స్థానిక నగర పాలక సంస్థ ఎన్నికల్లో విజయఢంకా మ్రోగిస్తామని మల్లాది విష్ణు విశ్వాసం వ్యక్తం చేశారు.