బస్సు టిక్కెట్ ధర రూ15లక్షలు
By: Dimple Mon, 24 Aug 2020 11:00 AM
ఢిల్లీనుంచి లండన్, లండన్ నుంచి ఢిల్లీకి బస్సు టిక్కెట్ ధర విన్నవారిని విస్తుపోయేలా చేస్తోంది. ఏకంగా 15 లక్షలరూపాయలట. అదేంటి బస్సులో ప్రయాణానికి రూ.15 లక్షలా..? అని ఆశ్చర్యపోకండి! ఎందుకుంటే ఆ బస్సు వెళ్లేది దేశ రాజధాని దిల్లీ నుంచి బ్రిటన్ రాజధాని లండన్కు మరి. వినటానికి వింతగా ఉన్నా ఇది నిజం. అంతదూరం బస్సులో ప్రయాణమా అని మరోసారి ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఇది మామూలు ప్రయాణం కాదు.. సాహస యాత్ర. ‘బస్ టు లండన్’ పేరుతో ఈ సాహస యాత్రకు గురుగ్రామ్కు చెందిన అడ్వెంచర్స్ ఓవర్ ల్యాండ్ అనే ట్రావెల్ సంస్థ శ్రీకారం చుట్టింది. 18 దేశాల గుండా 70 రోజుల పాటు 20 వేల కి.మీ ఈ ప్రయాణం సాగనుంది.
ఇందులో భాగంగా మయన్మార్, థాయ్లాండ్, లావోస్, చైనా, కిర్గిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల గుండా ఈ బస్సు వెళుతుంది. 20 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్రత్యేక బస్సులో ఇద్దరు డ్రైవర్లు, ఓ గైడ్, సహాయకుడు ఉంటారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బస్సులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ ప్రయాణానికి వెళ్లాలనుకునేవారికి వీసా, భోజన వసతి సదుపాయాలు సంబంధిత ఏర్పాట్లు కూడా ట్రావెల్ సంస్థే చూసుకుంటుంది. షెడ్యూల్ ప్రకారం మే 21న ఈ ప్రయాణం ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఇంకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెట్టలేదని సంస్థ తెలిపింది. ప్రయాణికులు మొత్తం అన్ని దేశాలు కాకుండా తాము కోరుకున్న దేశాల వరకు కూడా వెళ్లే వెసులుబాటు ఉంది. ఆ మేరకే టికెట్ ధర కూడా ఉంటుంది. అయితే దిల్లీ నుంచి లండన్ ప్రయాణ టికెట్ ధర మాత్రం రూ.15 లక్షలుగా సంస్థ నిర్ణయించింది.