బురేవి తుఫాను...రెండుసార్లు తీరం తాకను౦ది...కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్...
By: chandrasekar Wed, 02 Dec 2020 3:35 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన
అల్పపీడనం మంగళవారం ఉదయం తీవ్ర వాయుగుండంగా మారి అనంతరం తుఫాన్గా మారినట్టు భారత
వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది
పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి బుధవారం రాత్రికి శ్రీలంక సమీపంలో తీరం దాటే అవకాశం
ఉందని తెలిపింది. నైరుతి దిశగా గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో కదులుతున్న బురేవి
తుఫాను ప్రస్తుతం శ్రీలంకలోని ట్రింకోమలీకు తూర్పు-ఆగ్నేయంగా 300
కి.మీ. దూరంలో, తమిళనాడులోని కన్యాకుమారికి తూర్పున పాంబన్కు
తూర్పు-ఆగ్నేయంగా 700 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ పేర్కొంది.
తుఫానుగా మారిన తర్వాత
పశ్చిమ- వాయువ్వ దిశగా పయనించి శ్రీలంక వద్ద తీరాన్ని తాకిన తర్వాత దాదాపు పశ్చిమ
దిశగా మళ్లి డిసెంబరు 3 న
కొమొరిన్ ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. తర్వాత డిసెంబర్ 4
తెల్లవారుజామున కన్యాకుమారి, పాంబన్ మధ్య దక్షిణ పశ్చిమ-నైరుతివైపుగా పయనించి
దక్షిణ తమిళనాడు వద్ద తీరాన్ని దాటుతుంది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 75-85 కిలోమీటర్ల
వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కొన్ని చోట్ల
ఈ గాలుల తీవ్రత 95 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. బురేవి
తుఫాన్ ప్రభావంతో డిసెంబరు 2 నుంచి 4 వరకు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బుధ, గురువారాల్లో
ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని
చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
కొన్ని చోట్ల శుక్రవారం
కూడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తుఫాను ప్రభావం తిరునాల్వేలి, కన్యాకుమారి, రామనాథపురం, తూతుకూడి, టెంకాసీ, శివగంగయ్ ప్రాంతంపై ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.
డిసెంబరు 2 నుంచి 4 వరకు కేరళలోని తిరువనంతపురం, కొల్లం, పత్తనంథిట్టా, అలప్పూజలో, దక్షిణ
తమిళనాడులోని పలు ప్రాంతాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురువనున్నాయని తెలిపింది.
తమిళనాడు, పుదుచ్చేరి, మహే, కరైకల్, ఉత్తర
కేరళలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు
లక్షదీప్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ
పేర్కొంది. తుఫాన్ తీరం వైపు తరలివస్తున్న సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని
ఐఎండీ అధికారులు అంటున్నారు. మత్స్యకారులెవరూ బంగాళఖాతంలోకి చేపల వేటకు
వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే చేపల వేటకు వెళ్లిన వారు
వెంటనే తిరిగొచ్చేయాలని సూచించారు.