కూలిన ఐదంతస్తుల భవనం - శిధిలాల కింద చిక్కుకున్న జనం
By: Dimple Mon, 24 Aug 2020 11:57 PM
మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మహద్ ప్రాంతంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 15మంది గాయపడగా.. దాదాపు 70 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం. మరోవైపు, సహాయక సిబ్బంది 15 మందిని కాపాడినట్టు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముంబయి నుంచి ఘటనా స్థలానికి బయల్దేరాయి. ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. కూలిన ఈ భవనంలో 45 ఫ్లాట్లు ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలంలో దుమ్ము, ధూళి దట్టంగా అలముకొంది.
ఈ రోజు సాయంత్రం 6.50 గంటల ప్రాంతంలో మహద్లోని మండలం కజాల్పురలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిపోయిందని ఎన్డీఆర్ఎఫ్ అధికారి వెల్లడించారు. శిథిలాల కింద 50మందికి పైగా చిక్కుకొని ఉంటారని భావిస్తున్నట్టు చెప్పారు. సహాయ చర్యలకు అవసరమైన సామగ్రితో మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపినట్టు అధికారి తెలిపారు.
క్షతగాత్రులను చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు. దీనిపై స్థానిక మంత్రి అదితి తట్కరే మాట్లాడుతూ.. స్థానిక సహాయక బృందాలు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నట్టు తెలిపారు. వీటికి అదనంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొంటాయని తెలిపారు.
ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. కలెక్టర్ నిధి చౌధురి, స్థానిక ఎమ్మెల్యే భరత్ గొగవాలేకు ఫోన్ చేసి మాట్లాడారు. దీనిపై విచారణకు ఆదేశించారు. సహాయక చర్యలు త్వరితగతిన చేపట్టేలా అన్ని చర్యలూ తీసుకోవాలని సూచించారు.
ఎపీలో అవినీతి నిరోధానికి దిశ తరహాలో బిల్లు
అధికారులు లంచం తీసుకుంటూ దొరికితే నిర్దిష్ట సమయంలోనే చర్యలు తీసుకునేలా బిల్లు తీసుకురావాలని ఉన్నతాధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అవినీతి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు.
అవినీతి నిరోధానికి ‘దిశ’ తరహాలో బిల్లు రూపొందించాలని ఆదేశించారు. 1902కు వచ్చే అవినీతి సంబంధ ఫిర్యాదులన్నీ అవినీతి నిరోధకశాఖకు చెందిన 14400కు బదలాయించాలని సీఎం స్పష్టం చేశారు.
గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులను అనుసంధానించాలని సీఎం నిర్దేశించారు. తహశీల్దార్, ఎంపీడీవో, సబ్రిజిస్ట్రార్, మున్సిపల్, పట్టణ ప్రణాళిక కార్యాలయాల్లో జరిగే అవినీతిపై ప్రధానంగా దృష్టి సారించాలని ఆదేశించారు.
ప్రభుత్వంలోని ప్రతి విభాగంలోనూ రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని.. టెండర్ విలువ రూ.కోటి దాటితే రివర్స్ టెండరింగ్కు వెళ్లాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు.