విశాఖ తీరంలో విషాదం ...ఉద్యోగం రావడం లేదని యువకుడు ఆత్మహత్య
By: Sankar Wed, 09 Sept 2020 12:29 PM
ఉద్యోగం రావడం లేదన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖపట్నంలోని గాజువాకలో విషాదం నింపింది. ‘గుడ్ బై ఎవ్విర్ వన్ ఇన్ మై లైఫ్.. థాంక్యూ..’ అంటూ వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్న యువకుడు.. తన ఫ్రెండ్కి ఫోన్ చేసి హెల్మెట్ బండిలోనే ఉంది. తీసుకో’ అంటూ మెసేజ్ పెట్టాడు. కొద్దిసేపటికే యారాడ సముద్ర తీరంలో విగతజీవిగా మారాడు. గాజువాక పెంటయ్యనగర్కు చెందిన బొండపల్లి సుధీర్ కుమార్ బీటెక్ చదివి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు.
మధ్యాహ్నం ఇంట్లో భోజనం చేసి స్కూటీపై యారాడ బీచ్కు వెళ్లాడు. కొద్దిసేపటికే తీరంలో విగతజీవిగా కనిపించడంతో కమ్యూనిటీ గార్డులు న్యూపోర్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ పైడపునాయుడు, ఎస్ఐ శ్రీనివాసరావులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు.
మృతుడు చెప్పులు ధరించి, పర్సు, చరవాణి జేబులోనే ఉండడాన్ని బట్టి ఆత్మహత్యగానే భావించారు. వాట్సాప్ స్టేటస్, ఫ్రెండ్కి పంపిన మెసేజ్ ఆధారంగా సుధీర్ ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న సుధీర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఉద్యోగం రాలేదని తమ కొడుకు తరుచూ మనస్తాపం చెందేవాడని, ఇంటర్వ్యూ కోసం ఈ నెలాఖరున బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని వారు చెబుతున్నారు. సుధీర్కు ప్రేమ వ్యవహారమేదీ లేదని, ఉద్యోగం రాలేదని తమ వద్ద కూడా బాధపడేవాడని స్నేహితులు చెబుతున్నారు.