రైతు సంఘాల భారత్ బంద్ కు బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ పూర్తి మద్దతు
By: Sankar Mon, 07 Dec 2020 6:02 PM
పార్లమెంటులో అప్రజాస్వామికంగా రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆమోదించిన మూడు రైతు, వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ బిల్లు 2020 రద్దుచేయాలని ఆందోళన చేస్తున్న రైతు సంఘాల డిమాండ్లకు బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ పూర్తి మద్దతును ఇస్తున్నట్లు సర్కిల్ కార్యదర్శి జే సంపత్ రావు ప్రకటించారు.
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించి, రైతులకు కనీస మద్దతు ధర లేకుండా చేయడం దారుణమన్నారు. ఈ చట్టాలు ఆహార భద్రతకు ముప్పు తెచ్చేలా ఉన్నాయన్నారు. ఇప్పటికే రైతుల ఆందోళనలకు మద్దతుగా బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు భోజన విరామ సమయంలో నిరసన తెలిపిందన్నారు.
భారత్ బంద్కు మద్దతుగా బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలపాలని జే సంపత్ రావు విజ్ఞప్తి చేశారు.