కరోనా కారణంగా ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్న బ్రిటన్
By: chandrasekar Thu, 13 Aug 2020 12:50 PM
ప్రభుత్వ సంస్థ ఆఫీస్ ఆఫ్
నేషనల్ స్టాటిస్టిక్స్ డేటాను బుధవారం విడుదల చేసిన తరువాత బ్రిటన్ ఆర్థిక మాంద్యానికి చేరుకున్న విషయం
స్పష్టమైంది. ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్ - జూన్) యూకే ఆర్థిక వ్యవస్థ 20.4 శాతం
క్షీణించింది. అంతకుముందు 2009లో ఒకసారి బ్రిటన్ ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్న
విషయం తెలిసిందే .జనవరి-మార్చితో ముగసిన తొలి త్రైమాసికంలో బ్రిటన్ జీడీపీ 2.2 శాతం
పడిపోయింది. కరోనా కారణంగా ఏర్పడిన
మాంద్యం తరువాత బ్రిటన్ జీడీపీ అతిపెద్ద త్రైమాసిక క్షీణతను కలిగి ఉందని నేషనల్
స్టాటిస్టిక్స్ కార్యాలయానికి చెందిన జోనాథన్ ఎథో చెప్పారు.
ఆర్థిక శాస్త్ర నిబంధనల
ప్రకారం ఆర్థిక వ్యవస్థ వరుసగా రెండు త్రైమాసికాలకు క్షీణించినప్పుడు అది ఆర్థిక
మాంద్యంలో చిక్కుకున్నదని భావించబడుతుంది. జాతీయ గణాంకాల కార్యాలయం జూన్ నెలలో
కోలుకునే సంకేతాలు ఉన్నాయని తెలిపింది. జూన్ నెలలో బ్రిటన్ జీడీపీ మే నెలతో
పోలిస్తే 8.7 శాతం పెరిగింది. అయినప్పటికీ, జూన్
నెలలో బ్రిటన్ జీడీపీ 2020 ఫిబ్రవరితో పోలిస్తే 16.66 శాతం తగ్గిందని ఎథో
చెప్పారు. ఫిబ్రవరిలో కరోనా వైరస్ మహమ్మారికి బ్రిటన్ దెబ్బతినలేదు. అయితే, మార్చి
24
నుంచి ప్రారంభమైన లాక్డౌన్.. ఆర్థిక
వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది.
ఈ సంవత్సరం బ్రిటన్
ఆర్థిక వ్యవస్థ కరోనా వైరస్ మహమ్మారికి ముందు ఉన్నస్థాయికి చేరుకోకపోవచ్చని
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గత వారం తెలిపింది. నిరుద్యోగం భారీగా పెరుగుతుందని బ్యాంక్
హెచ్చరించింది. జూన్ త్రైమాసికంలో బ్రిటన్ క్షీణత యూరో జోన్ యొక్క 12.1 శాతం, అమెరికా
9.5 శాతం
కంటే ఎక్కువగా ఉంది. బ్రిటన్ చాలా కష్టతరమైన సమయాన్ని అనుభవిస్తున్నట్లు గణాంకాలు
చెబుతున్నాయని, లక్షలాది మంది ప్రజలు నిరుద్యోగులుగా మారగా.. రాబోయే
నెలల్లో నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం ఉన్నదని బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి
సునాక్ చెప్పారు.