మండిపడ్డ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
By: chandrasekar Wed, 01 July 2020 8:02 PM
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
ప్రజలకు సేవ చేస్తుంటే తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు
చంద్రబాబునాయుడుకు కడుపు మండుతున్నట్లుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స
సత్యనారాయణ మండిపడ్డారు. తప్పుడు లేఖలు ఇచ్చినట్లు తేలితే నారా లోకేష్ అరెస్టును
ఎవరూ అడ్డుకోలేదని తేల్చిచెప్పారు. అలాగే పేదలకు మేలు చేసే మంచి పనులను అడ్డుకుంటే
దేవుడు కూడా క్షమించడని శాపనార్థాలు పెట్టారు.
తాడేపల్లిలో మంగళవారం
బొత్స మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పలోకి
దించారని ఆరోపించారు. ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే
అచ్చెన్నాయుడును అన్యాయంగా అరెస్ట్ చేశారని అంటున్నారు గానీ అవినీతి జరగలేదని
మాత్రం చంద్రబాబు చెప్పలేకపోతున్నారని బొత్స వ్యాఖ్యానించారు. లేఖలు తాను కూడా
ఇచ్చానని చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ అంటున్నారని, ఒకవేళ
తప్పుడు లేఖలు ఇచ్చినట్లు తేలితే లోకేష్కు కూడా అరెస్ట్ తప్పదని హెచ్చరించారు.
స్థానిక సంస్థల
ఎన్నికల్లో బీసీలకు 50 శాతానికి పైగా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పిన
వ్యక్తి సీఎం జగన్మోహన్రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. బీసీల రిజర్వేషన్లకు
గండి కొట్టి, కోర్టులో కేసులు వేయించింది చంద్రబాబేనని
పేర్కొన్నారు. అలాగే వైఎస్సార్ సీపీ నేత మోకా భాస్కర్ రావు హత్యపై చంద్రబాబు
ఎందుకు మాట్లాడటం లేదని బొత్స సత్యానారాయణ ప్రశ్నించారు.
ఎల్జీ పాలిమర్స్
బాధితులను ఎందుకు చంద్రబాబు, లోకేష్ పరామర్శించలేదని ప్రశ్నించారు. మచిలీపట్నంలో
జరిగిన హత్యపై ఎందుకు చంద్రబాబు మాట్లాడం లేదని నిలదీశారు. మచిలీపట్నంలో నడిరోడ్డుపై దారుణంగా వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ నేతను చంపారని ఎందుకు కొన్ని మీడియా సంస్థలు ఈ హత్యను రాయడం
లేదని బొత్స ప్రశ్నించారు.