బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో రేపిన దుమారం...ఫ్రీ వ్యాక్సిన్ బీహార్ కేనా?
By: chandrasekar Fri, 23 Oct 2020 1:28 PM
బీహార్ అసెంబ్లీ
ఎన్నికల్లో బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో పెద్ద దుమారం రేపింది. జేడీయూతో కలసి
తాము మరోసారి అధికారంలోకి వస్తే బీహార్ ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్
అందిస్తామంటూ బీజేపీ తమ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ అంశం రాజకీయ ప్రత్యర్థులకు
మండి పడుతున్నారు. ప్రాణాలను కాపాడే కరోనా
వైరస్ వ్యాక్సిన్ను కూడా తమ స్వార్థ రాజకీయాల కోసం, ఎన్నికల్లో ఓట్లకు
ముడిపెడతారా అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈ అంశంపై బీహార్లో
ప్రతిపక్షాలు మండిపడుతుంటే ఇప్పుడు మరో నేత కూడా బీజేపీపై ధ్వజమెత్తారు. మొన్నటి
వరకు ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ మంత్రిగా కొనసాగిన అకాలీదళ్ నేత హర్ సిమ్రత్
కౌర్ బాదల్ బీజేపీపై మండిపడ్డారు. ఎన్నికల్లో ఓట్ల కోసం కరోనా వ్యాక్సిన్ను
వినియోగించుకోవడం అనైతికమని వ్యాఖ్యానించారు. ‘ఫ్రీ వ్యాక్సిన్ బీహార్ కేనా? ఇది
హాస్యాస్పదం. అంటే, దేశంలో ఇతర ప్రాంతాలు ట్యాక్స్లు కట్టడం లేదా? వాళ్లు
భారత పౌరులు కాదా? కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికీ అందించాల్సిన బాధ్యత
భారత ప్రభుత్వం మీద ఉంది. ప్రాణాలు నిలబెట్టే వ్యాక్సిన్ను ఓట్లు పొందే సాధనంగా
వాడుకోవడం పూర్తిగా అనైతికం.’ అని హర్సిమ్రత్ కౌర్ బాదల్ ట్వీట్ చేశారు.
గత నెలలో కేంద్ర
ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు బిల్లులను వ్యతిరేకిస్తూ అకాళీదళ్ ఎన్డీయే నుంచి
తప్పుకొంది. ఈక్రమంలో ఎన్డీయే నుంచి అకాళీదళ్ తప్పుకొంది. హర్ సిమ్రత్ కౌర్ బాదల్
కేంద్రమంత్రి పదవి నుంచి తప్పుకొన్నారు. మొదట బిల్లులను సమర్థించిన అకాళీదళ్
మధ్యలో తమ వైఖరిని మార్చుకుంది. ఫ్రీ కరోనా వ్యాక్సిన్ అంశం పెద్ద దుమారం రేపింది.
బీహార్ వాసులకే ఉచితంగా ఇస్తారా? అనేది ఒకటైతే, అసలు వ్యాక్సిన్ లాంటి అంశానికి ఓట్లకు ముడిపెట్టడం
మీద విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో బీజేపీ ఐటీ సెల్ ఇన్ చార్జి అమిత్ మాలవీయ దీనిపై
క్లారిటీ ఇచ్చారు. ‘కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు నామమాత్రపు ధరకు
వ్యాక్సిన్ అందిస్తుంది. అయితే, దాన్ని రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఇవ్వడమా లేకపోతే ఆ
ధరను ప్రజల వద్దే వసూలు చేయడమా అనేది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలి.
బీహార్లో మాత్రం బీజేపీ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది.’ అని అమిత్ మాలవీయ
పేర్కొన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు
జరుగుతున్న వేళ ఈ రోజు బీజేపీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అందులో తొలి హామీగా
‘ఉచిత వ్యాక్సిన్’ను పొందుపరిచింది. ‘కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన వెంటనే పెద్ద
ఎత్తున ఉత్పత్తి చేసి ప్రతి ఒక్క బీహారీకి ఉచితంగా అందిస్తాం.’ అని కేంద్ర మంత్రి
నిర్మలా సీతారామన్ చెప్పారు. మరోవైపు తమిళనాడు సీఎం పళనిస్వామి కూడా కరోనాకు
వ్యాక్సిన్ వచ్చిన వెంటనే ఉచితంగా రాష్ట్ర ప్రజలకు అందిస్తామని ప్రకటించారు.
తమిళనాట వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.