వరద సాయం ఆపాలని నేను చెప్పలేదు ..బండి సంజయ్
By: Sankar Wed, 18 Nov 2020 9:58 PM
వరద సాయం ఆపాలని తాను ఎన్నికల కమిషన్కు లేఖ రాయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. తన సంతకం పోర్జరీ చేసి లేఖ విడుదల చేశారని ఆరోపించారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ వల్లే వరద సాయం ఆగిందంటూ టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలే తన సంతకం పోర్జరీ చేసి లేఖ విడుదల చేశారని ఆరోపించారు.
వరద సాయం బీజేపీ ఆపలేదని చెప్పడానికి చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి దగ్గర ప్రమాణం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, సీఎం కేసీఆర్ ఒట్టు వేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి కేసీఆర్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణలోనే ఏమి చేయలేని కేసీఆర్.. ఇక ఢిల్లీలో ఏం చేస్తాడని ఎద్దేవా చేశారు. కాగా, వరద సాయం నిలిపివేయాలని కోరుతూ ఈసీకి బండి సంజయ్ రాసినట్లుగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.