ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బీజేపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు...
By: chandrasekar Mon, 14 Dec 2020 10:46 PM
రాష్ట్రానికి రాజధానిగా
అమరావతే ఉండాలని బీజేపీ అధ్యక్షుడు సోము పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం
కూడా విజయవాడలోనే నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని
నరేంద్ర మోదీ ప్రతినిధిగా హామీ ఇస్తున్నానని అన్నారు. రాజధాని ప్రాంతంలో
జరుగుతున్న అభివృద్ది అంతా మోదీ చేయిస్తున్నదేనని చెప్పారు. సోమవారం తుళ్లూరులో భారతీయ కిసాన్ సంఘ్
సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాము అధికారంలో వస్తే అమరావతి రైతులకు
ఇచ్చిన ఫ్లాట్లను రూ. 2వేల కోట్లతో అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం
రాజధానులు మార్చినా కేంద్ర సంస్థలు అమరావతిలో ఉంటాయని అన్నారు. రాజధాని ప్రాంత
రైతులకు ఇచ్చిన హామీలు నేరవేరాలంటే రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలని కోరారు.
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు ఏడాది కాలంగా నిరసనలు
తెలియజేస్తున్నారు. వైసీపీ మూడు రాజధానుల నిర్ణయం తీసుకొంది. ప్రతిపక్ష టీడీపీ
దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని
అమలు చేసేందుకు వ్యుహాలు రచిస్తోంది. అయితే ఈ అంశంపై కేంద్రంలో అధికారంలో బీజేపీ
పెద్దలు మాత్రం స్పష్టమైన వైఖరి తెలుపడం లేదు. మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతలు
ఎవరికి తోచిన రీతిలో వారు రాజధాని అంశంపై మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని
అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత
సంతరించుకున్నాయి.