గ్రేటర్లో గెలిపిస్తే ఎల్ ఆర్ ఎస్ రద్దు చేస్తాము...బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్
By: Sankar Tue, 17 Nov 2020 11:18 PM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో ఎంఐఎం పార్టీనే తమ ప్రత్యర్థి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. దుబ్బాక ఫలితాలే హైదరాబాద్లో రిపీట్ అవుతాయని, గ్రేటర్లో గెలిపిస్తే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని పేర్కొన్నారు.
జీహెంఎంసీ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. రేపటి బీజేపీ ఎన్నికల కమిటీ భేటీలో అభ్యర్థులను ఖరారు చేస్తామని తెలిపారు. గ్రేటర్లో పొత్తులపై తమనెవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు.
ఎల్ఆర్ఎస్ పోవాలంటే గ్రేటర్లో టీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇవ్వాలని బీజేపీ గ్రేటర్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ కె.లక్ష్మణ్ అన్నారు. గ్రేటర్లో బీజేపీని గెలిపిస్తే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్పై వెనక్కితగ్గడం ఖాయమన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తమ కార్యాచరణ గురించి లక్ష్మణ్ మాట్లాడుతూ.. రేపు బీజేపీ తొలి జాబితా విడుదల చేస్తామని తెలిపారు.
‘‘ఎక్కువ సమయం ఇస్తే బీజేపీ వాళ్ళు గ్రేటర్ పీఠం తన్నుకుపోతారని టిఆర్ఎస్ భావిస్తోంది. అందుకే కుట్ర పూరితంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిధంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారు. 18 లక్షల మంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.