బీజేపీ ఎమ్మెల్యే కరోనా కారణంగా మృతి..
By: chandrasekar Mon, 30 Nov 2020 12:34 PM
దేశంలో పలు రాష్ట్రాల్లో
కరోనా సెకండ్ వేవ్ రావడంతో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరణాలు కూడా
నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు కూడా కరోనా బారిన పడి
చనిపోతున్నారు. తాజాగా రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కరోనా కారణంగా
చనిపోయారు. ఆమె వయస్సు 59 సంవత్సరాలు. కొద్దిరోజుల క్రితం కరోనా పాజిటివ్ అని
తేలడంతో.. గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి
విషమించడంతో కొద్దిరోజుల నుంచి వైద్యులు ఆమెకు వెంటిలేటర్ ద్వారా చికిత్స
అందించారు. అయితే ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఆదివారం అర్థరాత్రి కిరణ్ మహేశ్వరి
తుదిశ్వాస విడిచారు.
ఉదయపూర్ నుంచి లోక్సభ
ఎంపీగా 2004 లో
ఎన్నికయ్యారు. 2009లో ఉదయపూర్ నుంచి సచిన్ పైలట్పై లోక్సభ ఎన్నికల్లో
పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆమె రాజసమంద్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం
వహిస్తున్నారు. నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఆమె విజయం సాధించారు. అన్లాక్
అనంతరం ఆమె విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ బారిన
పడ్డారు. మూడు వారాల క్రితం కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన కిరణ్ మహేశ్వరి..
అక్కడే తుది శ్వాస విడిచారు. ఇప్పటికే కరోనా కారణంగా రాజస్థాన్లో సహద కాంగ్రెస్
ఎమ్మెల్యే కైలాష్ త్రివేది భిల్వారా చనిపోయారు. కిరణ్ మహేశ్వరి మృతికి ప్రధాని
నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా రాజస్థాన్కు ఆమె ఎన్నో సేవలు అందించారని
పేర్కొన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, లోక్సభ
స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ
నాయకురాలు, మాజీ సీఎం వసుంధరరాజే కిరణ్ మహేశ్వరి మృతికి సంతాపం
తెలిపారు.