జీహెచ్ఎంసీ ఎన్నికలు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపి ముందంజ...
By: chandrasekar Fri, 04 Dec 2020 7:15 PM
జీహెచ్ఎంసీ ఎన్నికల
పూర్తి ఫలితాలు రావడానికి సమయం దగ్గరవుతోంది. ఇప్పటికే ఓవైపు జీహెచ్ఎంసీ
ఎన్నికల్లో పోల్ అయిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల
లెక్కింపులో పలు చోట్ల బీజేపి ఆధిక్యం కనబర్చగా.. మరోవైపు సాధారణ ఓట్లలో పలు చోట్ల
టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా ఇంకొన్ని స్థానాల్లో బీజేపి ఆధిక్యం కనబరుస్తోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికలు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపి ముందంజలో కొనసాగిన
సందర్భంగా బీజేపి నేత, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి ప్రముఖ న్యూస్
ఏజెన్సీ ఏఎన్ఐ మాట్లాడుతూ.. ''మార్చిలో జరగాల్సిన జీహెచ్ఎంసీ ఎన్నికలు డిసెంబర్లోనే
నిర్వహించడానికి కారణం టీఆర్ఎస్కి బీజేపి భయం పట్టుకోవడమే'' అని
పేర్కొన్నారు.
దుబ్బాక ఉప ఎన్నికల
ఫలితాల్లో బీజేపి విజయం సాధించడంతోనే తెలంగాణలో జనం మార్పును కోరుకుంటున్నారని
అర్థమైందని ఇంకా ఆలస్యం చేస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు మరింత వ్యతిరేకంగా
వస్తాయనే భయంతోనే సీఎం కేసీఆర్ ముందస్తుగా ఎన్నికలకు వెళ్లారని ధర్మపురి అరవింద్
ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి ఎంపీ
అరవింద్ మాట్లాడుతూ.. '' ఇప్పటికే రాష్ట్రంలో బీజేపికి అనుకూల పవనాలు
వీస్తున్నాయని తెలిపారు. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపికి 60
స్థానాలే రావొచ్చు లేదా 70 స్థానాలే రావొచ్చు కానీ ఇక్కడ మొదలయ్యే మార్పుతో
తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో,
2024 లోక్ సభ ఎన్నికల్లో మార్పుకు పునాధి పడనుంది అని తెలుస్తోందన్నారు.
అంతేకాదు.. 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి తెలంగాణ నుంచి
కనీసం 15 లోక్
సభ సీట్లు గెలిచి ఇస్తామని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి ధీమా వ్యక్తంచేశారు.