- హోమ్›
- వార్తలు›
- కరోనా నియంత్రణలో పార్టీ పరంగా సాయం చేస్తామన్న కెసిఆర్ పట్టించుకోలేదు ..బీజేపీ నేత కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి
కరోనా నియంత్రణలో పార్టీ పరంగా సాయం చేస్తామన్న కెసిఆర్ పట్టించుకోలేదు ..బీజేపీ నేత కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి
By: Sankar Mon, 06 July 2020 2:29 PM
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వ పూర్తిగా విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర బృందం సలహాలు, సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, కరోనాతో హైదరాబాద్ ఎప్పుడు పేలుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల స్థాయి నేతలతో జరిగిన బీజేపీ జన్సంవాద్ సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు.
రాష్ట్రానికి ఆరు లక్షల మాస్కులు, రెండులక్షల పీపీఈ కిట్లు, మెడిసిన్ అందజేసినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లోని ప్రజలకు పరీక్షల కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని, పార్టీ పరంగా సాయం అందిస్తామని చెప్పినా సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గరిబ్ కల్యాణ్ యోజన, జన్ధన్ ఖాతాదారులు, రైతులు, పింఛన్దారులకు, వలస కార్మికులకు కేంద్రం నుంచి అందించిన సాయం గురించి వివరించారు..
ఇక చైనా కుట్రలను అడ్డుకోని తీరుతామని, పొరుగు దేశాలు ఒక ఎత్తువేస్తే, తాము పది ఎత్తులు వేస్తామని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. దేశంలో ఆర్టికల్ 370, ట్రిఫుల్ తలాక్ రద్దు, సీఏఏ అమలు చారిత్రాత్మక నిర్ణయాలని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థలను గాడిన పెట్టేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు..